తొలి ఒడి అమ్మ ఒడి – మలి ఒడి అంగన్వాడీ బడి: చిన్నారుల భవిష్యత్తుకు అంగన్వాడీ టీచర్లు ఆధారస్తంభం
మనోహరాబాద్ మండలంలోని శుభం ఫంక్షన్ హాల్ లో జరిగిన అంగన్వాడీ ప్రీ-ప్రైమరీ గ్రాడ్యుయేషన్ కార్యక్రమం పెద్దగా ఆకర్షణగా నిలిచింది. చిన్నారులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాలు ఫ్రీ ప్రైమరీ స్కూల్లుగా మారుతున్నాయని, చిన్నారులకు క్రమశిక్షణతో కూడిన నైతిక విలువల విద్యను అందించడంలో టీచర్ల పాత్ర కీలకమని తెలిపారు. పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీసేలా, వారిలోని ప్రతిభను మెరుగుపరిచేలా ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో టెక్ ఎఫ్ఎంసీ ఇంటర్నేషనల్ ఆయిల్ అండ్ మైనింగ్ కంపెనీ సేవలు ప్రత్యేకంగా ప్రశంసించబడ్డాయి. సంస్థ విద్యార్థులకు స్పాన్సర్గా ముందుకు వచ్చి గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు, మెమెంటోలు అందజేయడం అభినందనీయం. ఈ కార్యక్రమాన్ని ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ సమర్థవంతంగా అమలు చేయడం గర్వకారణంగా ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.

Seethakka : చిన్నపిల్లల భవిష్యత్తు అంగన్వాడీ టీచర్లపై ఆధారపడి ఉంది
అంగన్వాడీ టీచర్లు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు, చార్టులు సందర్శకులను ఆకట్టుకున్నాయి. చిన్నారులకు అవసరమైన పోషకాహారం అందించేందుకు 57 రకాల ఆట వస్తువులు, గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేక బెంచీలు, బాలంమృతం వంటి పోషకాహార పదార్థాలు అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. అదే సమయంలో పోషకాహార రహిత అంగన్వాడీ కేంద్రాలుగా మారకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాలలో గుణాత్మక విద్య, పోషకాహారాన్ని సమర్థవంతంగా అందించేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తోందని తెలిపారు. చిన్నారులకు టేబుల్స్, అక్షరాలు, నెంబర్లు నేర్పేలా ఫ్రీ ప్రైమరీ యాక్టివిటీలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఆర్టీవో జై చంద్రారెడ్డి, అదనపు కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. టెన్త్ పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్మీడియట్కు చేరే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.
Read More : RTC: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె తాత్కాలిక వాయిదా