తెలంగాణ ప్రభుత్వంలో సంచలనాత్మక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఒక్క ఉత్తర్వుతో 6,729 మంది ఉద్యోగులను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ చేసి కాంట్రాక్టుపై పని చేస్తున్న ఉద్యోగులపై ఈ వేటు పడింది. వీరిలో అటెండర్ స్థాయి నుండి ఐఏఎస్ స్థాయి వరకు ఉన్న ఉద్యోగులు ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, మున్సిపల్ శాఖ, విద్యుత్, దేవాదాయ శాఖల్లో పనిచేస్తున్న అనేక మంది ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ ఉత్తర్వులను జారీ చేశారు.

ఉద్యోగుల తొలగింపు – ప్రభుత్వ తీరుపై చర్చ
ఈ నిర్ణయం ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా, విభిన్న శాఖల్లో కీలకంగా పనిచేస్తున్న అనేక మంది అనుభవజ్ఞులు ఒక్కసారిగా తొలగించబడటం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ 6,729 మందిలో వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు-హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్ జి.కిషన్రావు, కన్సల్టెంట్ ఇంజినీరు బీఎల్ఎన్ రెడ్డి, ట్రాన్స్కో, జెన్కోకు చెందిన 10 మంది డైరెక్టర్లు,హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ వాటర్వర్క్స్, రెరా, మెట్రో రైల్, మెప్మా, కుడా, వైటీడీఏ తదితర శాఖల అధికారులు, రెవెన్యూ, దేవాదాయం, ఆర్అండ్బీ, విద్యాశాఖ, బీసీ సంక్షేమం, రవాణా, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖల అధికారులు ఇరిగేషన్ శాఖలో ఇప్పటికే 200 మందికి పైగా ఉద్యోగుల తొలగింపు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పోలీస్ శాఖలో కూడా పెద్ద సంఖ్యలో బదిలీలు, తొలగింపులు కొత్త ఉద్యోగ నియామకాలు– ప్రభుత్వ ఉద్యోగాల్లో కొత్త అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంచనా. కొత్తగా గ్రూప్ -1, గ్రూప్ -2, గ్రూప్ -3, గ్రూప్ -4 ఉద్యోగాల నియామకాలకు ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. అనేక మంది రిటైర్డ్ అధికారులు తమ అనుభవంతో ప్రభుత్వం పాలనలో సహాయపడుతున్నారు. కానీ, తాజా ఉత్తర్వులతో అనుభవజ్ఞులను తప్పించడం పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. ముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించి, నూతన నియామకాలు చేపట్టాలనే ఉద్దేశ్యంతో రేవంత్ ప్రభుత్వం ముందుకెళ్తోంది. ప్రభుత్వ విధానాల్లో పారదర్శకత, సమర్థత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
తొలగించిన ఉద్యోగులకు తిరిగి అవకాశం ?
ప్రభుత్వం తమ ఉత్తర్వుల్లో ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించింది. తొలగించిన ఉద్యోగుల్లో ఎవరి సేవలు అవసరమని ప్రభుత్వం భావిస్తే, వారికి ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసి తిరిగి నియామకం చేపడతామని పేర్కొంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఒక్క జీవోతో 6,729 మంది ఉద్యోగులను తొలగించడం ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇది పరిపాలనా విధానంలో మొదటి కీలకమైన సంచలన నిర్ణయంగా చెబుతున్నారు.