శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారాముల దేవస్థానంలో జరిగే కళ్యాణ మహోత్సవం ఈ ఏడాది కూడా అద్భుతంగా జరిగింది.వేలాది మంది భక్తుల సాక్షిగా సీతారాముల కల్యాణ వేడుక వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణం రామనామంతో మారుమోగిపోయింది.దేవతల పెళ్లినే ప్రత్యక్షంగా చూసిన అనుభూతి భక్తులందరికీ కలిగింది.ఈ మహోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణితో హాజరయ్యారు.రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు సీఎం దంపతులకు వేదాశీర్వచనం అందించారు.మిథిలా మైదానంలో వేడుక ప్రత్యేకంగా నిర్వహించబడింది. పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అభిజిత్ లగ్నంలో శ్రీరాముడు సీతమ్మ మెడలో మాంగల్యాన్ని ధరిచాడు.ఉదయం తొమ్మిది గంటలకు కళ్యాణ కార్యక్రమం మొదలవగా, పదికి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా మిథిలా మండపానికి తీసుకొచ్చారు.

మూడు నెలల క్రితమే తయారు చేసిన తలంబ్రాలను పూజారులు వినియోగించారు.మంగళసూత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఇందులో మూడు పోగులు ఉండగా, ఒకటి సీతమ్మ పుట్టింటి వారు, మరొకటి అత్తవారిది, మూడవది భక్త రామదాసు తయారు చేయించారంటే ప్రత్యేకత అర్థం చేసుకోవచ్చు.మూడు వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం ఇప్పటికీ అదే భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది.12.02 నిమిషాలకు జీలకర్ర బెల్లం వేయడం జరిగింది. అనంతరం మాంగల్యధారణ కన్నుల పండువగా సాగింది. కళ్యాణం 12.40కి ముగిసింది. భక్తుల చీలికలతో రామనామం ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించింది.వేసవి వేడి ఉండగానే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

అన్నదానం, నీరు, వైద్యం వంటి ఏర్పాట్లతో ఆలయ అధికారులు సాఫీగా నిర్వహించారు. భద్రత కోసం పోలీసులు బందోబస్తు నిర్వహించారు.ఈ వేడుకలో టీటీడీ తరపున కూడా పట్టువస్త్రాలు సమర్పించటం ఆనవాయితీగా ఉంది. ఈసారి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు దంపతులు ప్రత్యేకంగా పాల్గొన్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఈవో రమాదేవి సమక్షంలో వారిని ఆలయ సంప్రదాయాలతో స్వాగతించారు.చివరగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “సీతారాముల ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సంతోషం కలగాలి” అంటూ ఆకాంక్షించారు. దేవస్థాన అభివృద్ధికి పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.