తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలపై ఏరియల్ సర్వే (Aerial survey of flood affected areas in Kamareddy district) నిర్వహించారు. ఆయనతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా ఉన్నారు. బాధితులను ప్రత్యక్షంగా కలసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.సర్వే అనంతరం కలెక్టరేట్లో వరద నష్టంపై సమీక్ష జరిగింది. ఎంత నష్టం జరిగిందో, పునరుద్ధరణకు ఎన్ని నిధులు అవసరమో తక్షణ నివేదిక ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. మరమ్మతులు తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సమన్వయమే కీలకమని సీఎం వ్యాఖ్య
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఉంటేనే వరద నష్టాలను తగ్గించగలమని సీఎం స్పష్టం చేశారు. “ఎవరికి వారు ఉంటే సంక్షోభాన్ని ఎదుర్కోలేము” అని హెచ్చరించారు. ఎరువుల పంపిణీలో సమన్వయం లోపం వల్లే రైతులకు సమస్యలు వస్తున్నాయని ఆయన గుర్తు చేశారు.యూరియా పంపిణీ సమయంలో ముందుగా రైతులకు టోకెన్లు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. దీంతో గందరగోళం లేకుండా రైతులకు ఎరువులు అందుతాయని చెప్పారు. సమస్యలు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని అధికారులను సూచించారు.
మరోసారి సమీక్ష నిర్వహణ
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని సమస్యలపై మరోసారి సమీక్ష చేస్తామని సీఎం ప్రకటించారు. ఈ సమీక్షను 15 రోజుల తర్వాత నిర్వహించనున్నట్లు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల పునరుద్ధరణ పనులు వేగవంతంగా కొనసాగాలని ఆయన ఆదేశించారు.బాధిత కుటుంబాలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని సీఎం భరోసా ఇచ్చారు. ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని, అవసరమైన సహాయం అందిస్తుందని ఆయన అన్నారు. బాధితుల సమస్యలు తక్షణమే పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
Read Also :