హైదరాబాద్ నగరంలో భారీ వర్షం (Heavy rain in Hyderabad city) జనజీవనాన్ని స్తంభింపజేసింది. గురువారం రాత్రి మొదలైన వాన శుక్రవారం ఉదయం వరకూ ఎడతెరిపి లేకుండా కురిసింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమైపోయాయి. రహదారులు ముంచెత్తడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, సికింద్రాబాద్, ఎల్బీనగర్ వంటి కీలక ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. రోడ్డు రవాణా పూర్తిగా దెబ్బతింది. కోఠి, మొజంజాహీ మార్కెట్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు.బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం గురువారం నాటికి అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో తెలంగాణపై కుండపోత వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం నాటికి ఇది వాయుగుండంగా మారి శనివారం నాటికి దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరం మీదుగా విదర్భ వైపు కదిలే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రాబోయే రోజుల్లో వర్షాలు
వాతావరణ శాఖ అంచనా ప్రకారం శుక్రవారం, శనివారం రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ కారణంగా పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు.శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ ప్రకటించారు.శనివారం మాత్రం నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.వాతావరణ శాఖ హెచ్చరికలపై ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
కీలక ఆదేశాలు
లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం సూచించారు. అవసరమైతే పునరావాస కేంద్రాలను వినియోగించుకోవాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ, జలమండలి, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేసి సమస్యలు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల సమయంలో అవసరం లేని ప్రయాణాలు చేయవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సరఫరా నిలిచే పరిస్థితుల్లో అత్యవసర సహాయ నంబర్లను వినియోగించాలని సూచించారు.
Read Also :