తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. అక్రమంగా పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, అధికారి, సాధారణ ప్రజల ఫోన్లు ట్యాప్ చేసిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను మరింత ముమ్మరం చేసింది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావును ఈసారి మరింత లోతుగా విచారించేందుకు సిట్ (SIT) రంగంలోకి దిగింది.

బాధితులతో ముఖాముఖి విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ మరింత దూకుడు పెంచింది. ఇప్పటికే 600 మంది బాధితుల జాబితాను సిట్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వారిలో కొందరు ఇబ్బందులకు గురైన తీరును వివరించడం ద్వారా ప్రభాకర్రావు ఏం సమాధానం చెబుతారనే విషయాన్ని సిట్ నమోదు చేయనున్నట్లు సమాచారం.
మావోయిస్టు మూల్యాంకనంతో దుర్వినియోగం
ప్రస్తుతం సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మంత్రి కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి వ్యాపారసంస్థల ఉద్యోగులు దాదాపు 40 మంది ఉన్నట్లు సమాచారం. 2023 ఎన్నికల సమయంలో వారందరి ఫోన్లను అక్రమంగా వినడం ద్వారా వ్యాపార లావాదేవీలకు ఆటంకం కలిగించినట్లు సమాచారం. సదరు మంత్రి మావోయిస్టు ప్రభావిత ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఆ ఉద్యోగులందరూ మావోయిస్టులకు సహకరిస్తున్నారనే కారణం చూపి, ఫోన్ అక్రమట్యాపింగ్కు పాల్పడినట్లు సిట్ దర్యాప్తులో బయటపడింది. అలాగే ఓ మహిళా ఎమ్మెల్యే ఫోన్నంబర్ను సైతం ఇలాగే ట్యాపింగ్ చేసి, ఆ సమాచారాన్ని అప్పటి బీఆర్ఎస్ మంత్రి ఒకరికి చేరవేసినట్లు సిట్ గుర్తించింది.
పోలీస్ అధికారుల ఫోన్లు కూడా ట్యాప్
ఈ ట్యాపింగ్ వ్యవహారం కేవలం రాజకీయ, వ్యాపార కోణంతో మాత్రమే పరిమితం కాలేదు. పోలీస్ విభాగానికి చెందిన కొందరి ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఠాణా ఎస్హెచ్ఓ, ఎస్ఐబీ సమాచారం చేరవేస్తున్నారనే అనుమానంతో, అతడి ఫోన్ను రహస్యంగా విన్నట్లు ప్రభాకర్రావు సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. నేతలకు, వ్యాపారులకు మావోయిస్టులకు సహకరిస్తున్నారనే ముద్రవేసి ట్యాపింగ్కు అనుమతులు పొందినట్లుగా సమాచారం. ఇన్స్పెక్టర్కు మావోయిస్టులతో సంబంధాలేముంటాయని సిట్ ప్రభాకర్రావును ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ప్రణీత్ రావుకు అక్రమ పదోన్నతి
ఈ వ్యవహారంలో మరో కీలక పాత్రధారి ప్రణీత్ రావు గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. 2007 బ్యాచ్ ఎస్ఐగా పోలీస్శాఖలో అడుగుపెట్టిన ప్రణీత్రావుకు మునుగోడు ఉపఎన్నిక రూపంలో బంపర్ బొనాంజా లభించింది. ఆ ఎన్నికల సమయంలో ఎస్ఐబీలోని స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్లో ఫోన్ల అక్రమట్యాపింగ్కు పాల్పడినందుకు ప్రతిఫలంగా ప్రణీత్రావుకు ప్రభాకర్రావు డీఎస్పీగా పదోన్నతి ఇప్పించారు. 2022 నవంబర్లో ఉపఎన్నిక జరగ్గా, 2023 మార్చి 31న ప్రణీత్రావు డీఎస్పీ అయ్యారు. 2007 బ్యాచ్లో సుమారు 450 మంది ఎస్ఐగా పోలీస్శాఖలో చేరగా, ఆ బ్యాచ్ నుంచి ప్రస్తుతం ప్రణీత్రావు ఒక్కడే డీఎస్పీ కావడం గమనార్హం.
ప్రభాకర్రావు నల్గొండ ఎస్పీగా పనిచేసిన సమయంలో బీబీనగర్ ఎస్ఐగా ఉన్న ప్రణీత్రావు సామాజిక సమీకరణ దృష్ట్యా, ఆయనకు దగ్గరయ్యారు. అనంతరం ప్రభాకర్రావు ఇంటెలిజెన్స్లోకి రావడంతో ప్రణీత్రావు సైతం అక్కడే చేరి, 2017లో ఇన్స్పెక్టర్గా, తర్వాత అయిదేళ్లకే డీఎస్పీగా పదోన్నతి పొందారు.
విచారణ తుదిదశలోకి.. కీలక మలుపు?
ఈ నెల 17 వ తేదీన మరోసారి ప్రభాకర్రావు సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఆ రోజు నుంచే బాధితుల్లో కొందరిని ప్రభాకర్రావు ముందుంచి ముఖాముఖి మాట్లాడించడానికి రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
Read also: Hyderabad: అధిక వర్షాలు కురుస్తున్న హైదరాబాద్ లో భూగర్భజలాలు పెరగలే