తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గద్దర్ అవార్డులు (Gaddar Awards) ఇప్పుడు సినిమా పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంటున్నాయి. ప్రజాకవి గద్దర్ పేరుతో ఈ అవార్డులను ప్రదానం చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఆయన భావజాలాన్ని, ప్రజాపక్షత్వాన్ని గౌరవిస్తోంది. ఇటువంటి పురస్కారాల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం రెండు విభాగాల్లో అవార్డులను పొందడం గర్వకారణం అని ప్రముఖ నటుడు, నిర్మాత నాగబాబు పేర్కొన్నారు.

నిహారికకు గౌరవం, నాగబాబుకు గర్వం
నాగబాబు తన కుమార్తె నిహారిక నిర్మించిన తొలి చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’కు (Committee guys) గద్దర్ అవార్డుల్లో జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఉత్తమ చిత్ర అవార్డు, అలాగే దర్శకుడు యదు వంశీకి ఉత్తమ తొలి చిత్రం దర్శకుడు అవార్డు లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
రేవంత్ సర్కార్కు ప్రత్యేక కృతజ్ఞతలు
ప్రజాకవి గద్దర్ పేరిట తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఫిల్మ్ అవార్డులు ఏర్పాటు చేసి, ఆయన గౌరవాన్ని మరింత పెంచిందని నాగబాబు తన పోస్టులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.
యదు వంశీ ప్రతిభకు గుర్తింపు
ఈ చిత్రానికి దర్శకుడిగా బాధ్యతలు వహించిన యదు వంశీకి గద్దర్ అవార్డుల్లో ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు అవార్డు లభించడం మరో ముఖ్యమైన విజయంగా నిలిచింది. దీనిపై స్పందించిన నాగబాబు – “ఇది ఆయన ప్రతిభకు దక్కిన మంచి ప్రోత్సాహం,” అంటూ ప్రశంసలతో ముంచెత్తారు.
తాను తొలిసారిగా నిర్మించిన ‘రుద్రవీణ’ చిత్రానికి జాతీయ సమైక్యతపై ఉత్తమ చిత్రంగా నర్గీస్ దత్ అవార్డు లభించిందని, ఇప్పుడు అదే తరహాలో తన కుమార్తె నిర్మించిన తొలి చిత్రానికీ అలాంటి గౌరవం దక్కడం యాదృచ్ఛికమని, సంతోషకరమైన సంఘటన అని నాగబాబు అన్నారు. ఈ సందర్భంగా నిర్మాత నిహారిక, దర్శకుడు యదు వంశీతో పాటు చిత్ర యూనిట్లోని నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఆయన పేరుపేరునా శుభాకాంక్షలు తెలియజేశారు.
Read also: Aditi Bhavaraju : కీలక పాత్రలో కనిపించనున్న అదితి భావరాజు