తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ (Kavitha Letter) ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది. బీజేపీపై పోరాటం చేసి జైలు శిక్ష అనుభవించిన తనను పార్టీ పక్కన పెట్టినట్టు ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
బీఆర్ఎస్ రజతోత్సవ సభలో బీజేపీపై విమర్శలు
ముఖ్యంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభలో బీజేపీ(BJP)పై విమర్శలు లేకపోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేయడం, కేసీఆర్ చుట్టూ “దెయ్యాలు” ఉన్నాయనే వ్యాఖ్య రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో కవిత లేఖపై పలు వర్గాల నుంచి విమర్శలు, అనుమానాలు వెల్లువెత్తుతుండగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ను కలిసి చర్చించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఎర్రవల్లి ఫామ్ హౌస్లో భేటీ
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో జరిగిన ఈ భేటీలో కేటీఆర్, కేసీఆర్ మధ్య కవిత లేఖ, పార్టీ తీరుపై కీలక చర్చ జరిగినట్టు సమాచారం. కవిత అసంతృప్తి, పార్టీ కార్యకలాపాలపై ఆమె వ్యాఖ్యలు, బీఆర్ఎస్ కార్యాచరణకు తగిన మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం వంటి అంశాలపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. అంతేకాకుండా తెలంగాణ అవతరణ దినోత్సవాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఉద్దేశ్యాలు, రజతోత్సవ సభల నిర్వహణ వంటి కార్యక్రమాలపై కూడా వారు దృష్టిసారించినట్టు తెలుస్తోంది.
ఎవరికైనా అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ
ఇదిలా ఉండగా, ఈ వివాదంపై కేటీఆర్ ఇప్పటికే స్పందించారు. తమ పార్టీ ప్రజాస్వామ్య విధానాలను పాటిస్తుందనీ, ఎవరికైనా అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఉందని స్పష్టం చేశారు. లేఖ రాసిన కవితకు అది ఒక హక్కు అని అన్నారు. పార్టీ అంతర్గత విషయాలను బయట రాయడం అవసరం లేదన్న సందేశం ఆయన మాటలలో స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం బీఆర్ఎస్ ముందున్న ప్రధాన లక్ష్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల్లో నెలకొన్న నిరాశను వినియోగించుకోవడం, ప్రజల విశ్వాసం తిరిగి పొందడమేనని పార్టీ నేతలు చెబుతున్నారు.
Read Also : Miss World: మిస్ వరల్డ్ పోటీలో లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన.. వీడియో లీక్