తెలంగాణలో జరుగుతున్న మిస్ వరల్డ్ (Miss World) – 2025 పోటీల సందర్భంగా మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేత తెలంగాణలో మీరు ఇలాంటి అవమానపూరిత పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చినందుకు నేను నిజంగా చింతిస్తున్నాను. అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మిల్లా ఆరోపణలపై విచారణ చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

మిల్లా మ్యాగీ అసంతృప్తి వ్యక్తం
మిల్లా మ్యాగీ ఇటీవల మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ తమను వేశ్య లాగా చూశారని ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ పోటీల నుంచి మధ్యలోనే తప్పుకుని స్వదేశానికి వెళ్లిపోయారు. అక్కడ స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ ఆరోపణలు చేశారు. మరోవైపు మ్యాగీ ఆరోపణలను మిస్ వరల్డ్ పోటీల నిర్వహకులు ఇప్పటికే తీవ్రంగా ఖండించారు. అలాంటిది ఏమీ లేదని, ఆమెనే వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లిపోయినట్లు వివరించారు.
కేటీఆర్ ట్వీట్
ఈ ఘటనపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందిస్తూ ట్విట్టర్ (X) వేదికగా ఓ పోస్టును చేశారు. అందులో ఆయన ఇలా పేర్కొన్నారు. మిస్ వరల్డ్ వంటి అంతర్జాతీయ వేదికలపై స్త్రీ ద్వేషపూరిత మనస్తత్వాన్ని గట్టిగా ఎదుర్కోవడానికి చాలా ధైర్యం అవసరం. మిల్లా మ్యాగీ చాలా బలమైన మహిళ. తెలంగాణలో మీరు ఇలాంటి అవమానపూరిత పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చినందుకు నేను నిజంగా చింతిస్తున్నాను. తెలంగాణలో మహిళలను గౌరవించే గొప్ప సంస్కృతి ఉంది. మేము వారిని గౌరవిస్తాము, వృద్ధికి సమాన అవకాశాలను అందిస్తాము.
మహిళల గౌరవంపై తెలంగాణ ధైర్యంగా నిలబడాలి
తెలంగాణ తత్వం ఎప్పటినుంచో మహిళల గౌరవాన్ని కాపాడే దిశగా ఉన్నదని కేటీఆర్ గుర్తుచేశారు. మా భూమి నుంచి వచ్చిన గొప్ప నాయకులలో రాణి రుద్రమ, చిట్యాల ఐలమ్మ వంటి కొందరు మహిళలు ఉన్నారు. ఒక ఆడపిల్ల తండ్రిగా, ఏ స్త్రీ లేదా అమ్మాయి ఇలాంటి భయంకరమైన అనుభవాలను ఎదుర్కోకూడదని నేను కోరుకుంటున్నాను. మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నాను అని కేటీఆర్ తన పోస్టులో రాసుకొచ్చారు.
Read also: Gandhi Hospital: గాంధీ ఆసుపత్రిలో కొవిడ్ బాధితుల కోసం ప్రత్యేక వార్డులు