తెలంగాణలోని ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం జుడీషియల్ కమిషన్ గడువును మరో నెలపాటు పొడిగించింది. ఇప్పటికే విజిలెన్స్ మరియు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NDSA) తమ నివేదికలు సమర్పించినప్పటికీ, కమిషన్ నివేదిక ఇంకా పూర్తి కావాల్సి ఉంది.
కమిషన్ నివేదిక 90 శాతం పూర్తి
ప్రస్తుతం కమిషన్ నివేదిక 90 శాతం వరకు పూర్తయిందని అధికారులు తెలిపారు. మిగిలిన భాగాన్ని త్వరితగతిన పూర్తిచేసి, మే రెండవ వారంలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసే అవకాశం ఉందని సమాచారం. ఈ దిశగా కమిషన్ మరికొంతమంది వ్యక్తులను విచారించనుంది. విచారణలో ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు, ప్రాజెక్టు నిర్వాహకులు పాల్గొనవచ్చని భావిస్తున్నారు.
ఇప్పటికే నాలుగు సార్లు కమిషన్ గడువు పొడగింపు
గతంలో ఇప్పటికే నాలుగు సార్లు కమిషన్ గడువు పొడిగించబడిన సంగతి గమనార్హం. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో, నివేదికకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. కమిషన్ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలనే దిశగా ప్రభుత్వం ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది. నివేదిక వెలువడిన తరువాత కాళేశ్వరం ప్రాజెక్ట్పై మరింత స్పష్టత రానుంది.