తెలంగాణ రాజకీయాల్లో తాజాగా బీఆర్ఎస్ రజతోత్సవాల నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. ఈ నెల 27న బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) రజతోత్సవ సభను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. అయితే, ఈ సభలో పార్టి బ్యాక్డ్రాప్పై ‘TRS’ పేరా ఉంటుందా లేక ‘BRS’ పేరా ఉంటుందా? అనే ప్రశ్నను కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ వ్యంగ్యంగా లేవనెత్తారు. 2001లో స్థాపించిన పార్టీకి TRS అనే పేరు ఉండగా, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అడుగుపెట్టే ఉద్దేశంతో BRSగా మార్చారని గుర్తు చేశారు.
ఎంపీ ఛామల ఘాటు వ్యాఖ్యలు
చామల కిరణ్ మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న తర్వాత, దేశాన్ని దోచుకునే ఆలోచనతోనే TRS పార్టీ పేరు మార్చి BRS చేశారని” తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రజతోత్సవాల పేరుతో జరుగుతున్న సభలు TRS పుట్టిన రోజుకా? లేక BRS పుట్టిన రోజుకా? అనే స్పష్టత అవసరమని అన్నారు. పార్టీ పేరు మారిన తర్వాత కూడా TRSను గొప్పగా చెప్పుకోవడం రాజకీయ దౌర్భాగ్యమని ఆయన విమర్శించారు. ఇది కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకు మళ్ళీ పాత పేరుని వాడే ప్రయత్నమా అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ రజతోత్సవాలపై రాజకీయ వేడి
కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ రజతోత్సవాలపై రాజకీయ వేడి పెరిగింది. పార్టీలో నిజమైన ఉద్దేశం ఏమిటి? ఈ రజతోత్సవ సభ ద్వారా ఏ సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు? అన్న విషయాలపై చర్చ ప్రారంభమైంది. రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేయడం సహజమేనని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నా, పార్టీ కార్యకర్తలు మాత్రం స్పష్టమైన దిశానిర్దేశం కావాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.