తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఇటీవల అమలు చేసిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై ప్రయాణికుల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. ఒకవైపు ఇది మహిళలకు ఆర్థిక భారం తగ్గించి స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం కల్పిస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి. మరోవైపు బస్సు డ్రైవర్లు, కండక్టర్లు మహిళలను సక్రమంగా గౌరవించడం లేదని కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి.
అర్ధరాత్రి వేళ మహిళలకు ఇబ్బందులు
కొన్ని ఘటనల్లో అర్ధరాత్రి వేళ మహిళలు బస్సును ఆపమంటే బస్సు స్టాప్ లేదనే నెపంతో దూరంగా ఆపడం, అలా ప్రయాణికులను ఇబ్బందిపెట్టడం వంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. మహిళలకు ఎక్కడ బస్సు ఆపమన్నా ఆపాల్సిందే అనే ప్రభుత్వం నిబంధనను RTC డ్రైవర్లు పట్టించుకోవట్లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితులు రాత్రివేళల్లో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

ఉచిత సేవల వల్ల మారిన ప్రవర్తనా ధోరణులు?
కొంత మంది మహిళా ప్రయాణికులు, ఫ్రీ బస్ ప్రయాణ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత RTC సిబ్బంది తమతో తగిన గౌరవంతో వ్యవహరించడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు. “బస్సు కిందికి దిగేటప్పుడు డ్రైవర్లు, కండక్టర్లు అసహనంగా ఉంటున్నారు, కొంతమంది సిబ్బంది ఆవేశంగా మాట్లాడుతున్నారు” అని కొందరు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇది ఉచిత ప్రయాణం మహిళలకు గౌరవం తగ్గించిందా? అనే కొత్త చర్చకు దారితీసింది.
RTC సిబ్బంది బాధ్యత పెంచుకోవాలి
మహిళల భద్రత, గౌరవం తక్కువ కాకుండా ఉండాలంటే RTC సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణ పథకం ఉద్దేశం మహిళలకు మరింత స్వేచ్ఛ ఇవ్వడం కానీ, అదే సమయంలో వారి హక్కులను హరించడమో, గౌరవం తగ్గించడమో కాకూడదు. ఎక్కడ ఆపమన్నా ఆపే నిబంధన అమలు చేయడం, మహిళా ప్రయాణికుల పట్ల మర్యాదగా వ్యవహరించడం RTC సిబ్బంది బాధ్యత. ప్రయాణంలో వచ్చే ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలి.