మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విద్యార్థులు, నిరుద్యోగులు ప్రశ్నిస్తే వారి మీదే ఆంక్షలు, నిషేధాలు విధించడం కాంగ్రెస్ సర్కార్కు నిత్యకృత్యంగా మారిందని మండిపడ్డారు. యూనివర్సిటీల్లో ఆందోళనలపై నిషేధం విధించిన తర్వాత, ఇప్పుడు గ్రంథాలయాల్లోకి విద్యార్థులను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకమని విమర్శించారు. ప్రజాస్వామ్య పాలనలో ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉందని గుర్తుచేశారు.
గ్రంథాలయాలను రాజకీయ వేదికలుగా మార్చింది ఎవరు?
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు గ్రంథాలయాల్లో రాజకీయ సమావేశాలు జరిపారని, ఇప్పుడు అదే గ్రంథాలయాల్లో నిషేధాలు విధించడం ద్వంద్వ విధానాన్ని సూచిస్తున్నదని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో రాహుల్ గాంధీ(Rahul)ని లైబ్రరీకి తీసుకెళ్లి హామీలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఇప్పుడు ఎందుకు అభ్యంతరం చూపుతున్నారు అని నిలదీశారు. గ్రంథాలయాల చరిత్రను కలుషితం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నైతికతపై బోర్డులు పెట్టి సమాధానం చెప్పలేదని విమర్శించారు.
నిరుద్యోగుల హక్కులను అణిచే ప్రయత్నం వద్దు
జాబ్ క్యాలెండర్ను ‘జాబ్ లెస్ క్యాలెండర్’గా మలచారని, మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామన్న హామీని కాంగ్రెస్ విస్మరించిందని హరీశ్ రావు విమర్శించారు. నోటిఫికేషన్ల కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్న విద్యార్థులకు, నిరుద్యోగులకు తప్పుడు కేసులు పెడుతూ, ఢిల్లీకి తిరుగుతూ కాలం తీస్తున్నారని మండిపడ్డారు. ఆంక్షలతో నిరుద్యోగుల ఆవేదనను అణిచే ప్రయత్నం వృథా అని హెచ్చరించారు. ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే నెరవేర్చాలని, రెండేళ్లలో రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Read Also : Kidneys Health : ఈ పండ్లను తింటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.. అవి ఏమిటో తెలుసా..