ప్రజా సేవ పేరుతో రాజకీయాల్లో అక్రమ సంపాదనకు పాల్పడుతున్న అనేక మంది నాయకుల నడుమ, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య(Gummadi Narsaiah) నిజాయితీ, నిరాడంబరతతో ప్రత్యేకంగా నిలుస్తున్నారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా ఆయనపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదు. నేటి తరానికి ఆయన జీవన విధానం నిజమైన ప్రజా సేవకు ఆదర్శంగా నిలుస్తోంది.
గుమ్మడి నర్సయ్య పదవిలో ఉన్నప్పుడు అధికార వాహనాలు ఉపయోగించే అవకాశం ఉన్నప్పటికీ, ఆయన మాత్రం సైకిల్పై అసెంబ్లీకి వెళ్లేవారు. సామాన్య ప్రజలతో బస్సుల్లో ప్రయాణించటం, క్యూలో నిలబడి కంటి పరీక్షలు చేయించుకోవడం వంటి పనులు ఆయన వినయాన్ని, ప్రజలతో సమానంగా జీవించాలనే తత్వాన్ని ప్రతిబింబిస్తాయి.
Read Also: Food Scheme:కర్నూలు మార్కెట్ యార్డు – రైతులకు రూ.15కే కడుపునిండా భోజనం

కూతురు కొనిచ్చిన కారు వల్ల అప్పులపాలు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో నర్సయ్య(Gummadi Narsaiah) తన ఆర్థిక పరిస్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నా కూతురు ప్రొఫెసర్. ఈ వయసులో మీకు కారు అవసరమని భావించి అప్పు తీసుకుని నాకు కారు కొనిచ్చింది. కానీ పెన్షన్ డబ్బులు ఆ కారుకు డీజిల్, రిపేర్ ఖర్చులకు కూడా సరిపోవడం లేదు. అంతేకాక వ్యవసాయంలో వచ్చిన నష్టాలతో మరో ఐదు–ఆరు లక్షల అప్పులు ఉన్నాయి” అని ఆయన వివరించారు.
వ్యవసాయం, సాధారణ జీవనం
గుమ్మడి నర్సయ్య కుటుంబం తరతరాలుగా వ్యవసాయంపై ఆధారపడింది. తాత, తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన రెండు ఎకరాల భూమిలోనే ఇప్పటికీ ఆయన వ్యవసాయం చేస్తున్నారు. గతంలో వ్యవసాయం బాగానే ఉన్నప్పటికీ, ఇటీవల నష్టాలు రావడంతో సహకార సంఘానికి అప్పుపడ్డారని తెలిపారు.
నెటిజన్ల ప్రశంసలు
నర్సయ్య నిజాయితీ, సాదాసీదా జీవనశైలిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. “25 సంవత్సరాలు ప్రజల కోసం పని చేశారు, అందుకే ఆయన దగ్గర డబ్బులు లేవు. ఇది నిజమైన ప్రజాసేవకుడి లక్షణం” అని ఒకరు కామెంట్ చేశారు. మరో నెటిజన్ “జీవితాంతం సైకిల్ మీద తిరిగారు, ఇప్పుడు కారు మీద తిరుగుతూ ప్రజలకు మరింత దగ్గరగా ఉండండి” అని రాశారు. ప్రస్తుత రాజకీయాల్లో అధికారం అంటే సంపాదన మార్గమని భావించే వారిలో, గుమ్మడి నర్సయ్య లాంటి నాయకులు చాలా అరుదు. పదవిని ప్రజా సేవకు మాత్రమే వినియోగిస్తూ, నిజాయితీతో జీవించిన ఆయన తత్వం నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also