తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు (Contract and Outsourcing Employees) శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఫిక్స్డ్ టెన్యూర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న 12,055 మంది ఉద్యోగుల సేవలను పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్చి 31, 2026 వరకు వారి నియామకాన్ని కొనసాగిస్తూ అధికారికంగా జీవో జారీ చేసింది.
ఉద్యోగ భద్రతకు ఊతమిచ్చిన నిర్ణయం
ఈ నిర్ణయంతో ఉద్యోగుల భవిష్యత్తుకు కొంత భద్రత లభించనుంది. గత కొన్ని నెలలుగా తమ ఉద్యోగాల గురించి ఉక్కిరిబిక్కిరి అవుతున్న వారు, ఇప్పుడు ఊపిరి పీల్చుకునే స్థితికి వచ్చారు. రాష్ట్రంలోని గ్రామీణాభివృద్ధిలో ఈ ఉద్యోగులు కీలకంగా పనిచేస్తుండటంతో, ప్రభుత్వం వారిని కొనసాగించడం అభినందనీయంగా పేర్కొంటున్నారు.
పెండింగ్ జీతాల చెల్లింపు ప్రక్రియ పూర్తి
అంతేగాక, గత మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాల చెల్లింపు ప్రక్రియ కూడా పూర్తి చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. నేటి నుంచి రేపటి లోగా సంబంధిత ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమ కానున్నాయి. దీని వల్ల ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు కొంత ఉపశమనం లభించనుంది. ఈ నిర్ణయం ప్రభుత్వ సేవల్లో నిబద్ధతతో పని చేసే ఉద్యోగులకు నూతన ఉత్తేజాన్ని ఇచ్చింది.
Read Also : Sravana Masam : నేటి నుంచి శ్రావణ మాసం