రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న ఎడతెరిపి లేకుండా భారీ వర్షాల ప్రభావం గోదావరి(Godavari)లో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతి గణనీయంగా పెరుగుతోంది. వర్షాల కారణంగా అప్స్ట్రీమ్ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున వరద నీరు గోదావరిలోకి వచ్చి చేరుతోంది. దీంతో భద్రాచలం పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరిస్తోంది.
గోదావరి నీటి మట్టం వేగంగా పెరుగుతోంది
బుధవారం ఉదయం 6 గంటల సమయంలో గోదావరి నీటి మట్టం 17 అడుగులుగా నమోదవగా, సాయంత్రానికి అది 18.80 అడుగులకు చేరింది. అంటే ఒక్క రోజులోనే దాదాపు 2 అడుగుల మేర పెరిగినట్టయ్యింది. వర్షాలు ఇంకా కొనసాగుతుండటంతో నీటి మట్టం మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి 43 అడుగులు కాగా, నది ప్రవాహం దానిని దాటి వెళ్లే పరిస్థితులు ఏర్పడకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
తాలిపేరు ప్రాజెక్ట్ నుండి గోదావరిలోకి నీటి విడుదల
వరద ఉధృతి తగ్గించేందుకు చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు నుంచి 6 గేట్లను ఎత్తి 14,931 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. ఇది గోదావరిలో ప్రవాహాన్ని మరింత పెంచే అవకాశముంది. ప్రాజెక్టుల నుంచి నీటిని నియంత్రితంగా విడుదల చేస్తూ, పక్కా పర్యవేక్షణలో ఉంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు గోదావరి తీర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే తాత్కాలిక నిలయాలకు తరలించేందుకు రెస్క్యూ బృందాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
Read ALso : Low Pressure: రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్షాలు