ప్రతి సంవత్సరం మృగశిర కార్తె పర్వదినం మత్స్య ప్రియుల కోసం ఓ పండుగ వలె ఉంటుంది. ఈసారి కూడా మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ నగరంలోని దయారా చేపల మార్కెట్, రామనగర్, ఎర్రగడ్డ, మలక్పేట్, ముసారాంబాగ్ వంటి ప్రాంతాల్లోని పెద్ద చేపల మార్కెట్లు వినియోగదారులతో కిటకిటలాడాయి. పట్టణం నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున రావడంతో మార్కెట్ల వద్ద రద్దీ పెరిగింది. వివిధ రకాల చేపలు, సముద్రపు జీవులు, రొయ్యలు విరివిగా లభించాయి.

రాష్ట్రాల మధ్య మత్స్య వాణిజ్య రవాణా:
ఈ మృగశిర కార్తెకు సంబంధించిన ప్రత్యేకత ఏమిటంటే, రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా చేపల దిగుమతి భారీగా జరిగింది. ముఖ్యంగా
తెలంగాణ రాష్ట్రం: నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్, సూర్యాపేట, వరంగల్ ప్రాంతాల నుంచి తీసుకువచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం: విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, నర్సాపురం వంటి తీర ప్రాంతాల నుంచి టన్నుల కొద్దీ సముద్రపు చేపలు తరలించబడ్డాయి.
దయారా చేపల మార్కెట్కు దాదాపు 150 నుంచి 200 లారీల చేపలు దిగుమతి అయ్యాయి.
చేపల రకాల వివరాలు:
ఈసారి మార్కెట్లో దిగుమతి అయిన ప్రముఖ చేపలలో కొర్ర మీను, రూప్ చంద్, రవ్వ, బొచ్చ, బంగారు తీగ, గ్యాస్ కట్, వంజరం, ఖజూర, పిలాతి, జల్లలు, వాల్గా పండు, సముద్రం చేపలు పాంప్లెట్, పండుగొప్ప, మత్తి, రొయ్యలు, టైగర్ ఫ్రాన్స్ వంటి అనేక రకాల చేపలు ప్రస్తుతం రాంనగర్లోని దయారా చేపల మార్కెట్కు టన్నుల కొద్దీ దిగుమతి అయ్యాయని మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ తెలిపారు. మృగశిర సందర్భంగా తాము ఆశించిన మేరకు వ్యాపారం జరగలేదని ఆయన తెలిపారు. మార్కెట్కు పెద్ద ఎత్తున చేపలు దిగుమతి కావడంతో ధరలు కూడా తగ్గాయని ఆయన చెప్పారు.

ధరల మార్పు – వినియోగదారులకు ఊరట:
ఈ ఏడాది చేపల దిగుమతి విపరీతంగా పెరగడంతో ధరల్లో భారీగా తగ్గుదల కనిపించింది. కొర్రమీను కేజీ రూ.400-500లకు అమ్ముతున్నారు. గత మృగశిర సమయంలో దీని ధర కేజీ రూ.700-800 చొప్పున అమ్మేవారమని వ్యాపారులు తెలిపారు. ఈ ఏడాది కొర్రమీను పెద్ద ఎత్తున దిగుమతి కావడంతో రేటు చాలా పడిపోయిందని వాపోతున్నారు. బొచ్చ, రవ్వ లైవ్ చేపలు కేజీకి రూ.200-300 చొప్పున విక్రయిస్తున్నామన్నారు. బంగారు తీగ, గ్యాస్ కట్, వంజరం, ఖజూర, పిలాతి, జల్లలు, వాల్గా పండు చేపలు కూడా కిలో రూ.100-300 రూపాయలకు చొప్పున అమ్ముతున్నట్లు తెలిపారు. రొయ్యలు, టైగర్ ఫ్రాన్స్ ఇతర సముద్రపు చేపలు కేజీ రూ.300-500 వరకు విక్రయిస్తున్నారు. దయరా చేపల మార్కెట్లో హోల్ సేల్ అండ్ రిటైల్గా దాదాపు 1000 నుంచి 1500 మంది ఈ వ్యాపారం చేస్తున్నారు. ఇలా ధరలు సగానికి తగ్గిన కారణంగా, మత్స్య ప్రియులు పెద్ద మొత్తంలో కొనుగోలు చేశారు. తక్కువ ధర, ఎక్కువ రకాలు, తాజా సరుకు – ఇవన్నీ కలవడం వలన వినియోగదారుల హర్షం గగనాన్ని తాకింది.
మహిళలకు ఉపాధి – మార్కెట్ పక్కన కట్టింగ్ కేంద్రాలు:
దయారా మార్కెట్ ప్రాంతంలో 1000-1500 మంది వరకూ మత్స్య వ్యాపారం చేస్తున్నారని, మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ వెల్లడించారు. వీరిలో చాలామంది మహిళలు చేపల కటింగ్ ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఒక్కొక్కరు రోజుకు కనీసం ₹300 – ₹500 వరకు సంపాదించగలుగుతున్నారు. కొన్ని కుటుంబాలకు ఇది ప్రధాన ఆదాయ మార్గంగా మారింది.
Read also: Saleem: మద్యం మత్తులో భార్య అనుకుని పక్కింటి యువతిని పొడిచిన భర్త