Bandi Sanjay : ఉగాది పండుగ సందర్భంగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఏప్రిల్ నుంచి రేషన్ దుకాణాలలో రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయనున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీకి కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనున్న సన్న బియ్యం పంపిణీకి కేంద్ర ప్రభుత్వం రూ. 10 వేల కోట్లు ఇస్తుందని ప్రూవ్ చేస్తా అన్నారు. ఈ పథకానికి సంబంధించి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టవద్దని మేం అనలేదు.

ప్రధాని మోడీ ఫోటో ఎందుకు పెట్టరు?
కానీ అంత పెద్ద కార్యక్రమంలో ప్రధాని మోడీ ఫోటో ఎందుకు పెట్టరు? అని ప్రశ్నించారు. హుజూర్ నగర్ లో నిర్వహించిన అంత పెద్ద కార్యక్రమంలో కనీసం కేంద్రం సహకరిస్తోందని చెప్పలేకపోయారు. మాకు కేంద్రం పది వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారని చెప్పాల్సి ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం మిగతా మొత్తం కలిపి పేదలకు సన్న బియ్యం ఇస్తుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పకపోవడాన్ని బండి సంజయ్ తప్పుపట్టారు. కేంద్రం నుంచి పది వేల కోట్లు వస్తలేవని అంటారా నిరూపించడానికి తాను సిద్ధమని బండి సంజయ్ ఛాలెంజ్ చేశారు.
కేంద్ర సహకారంపై ఎందుకు నోరు విప్పరు?
రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2 వేల కోట్లు మాత్రమే. కిలోకు రూ.40లు చెల్లిస్తోంది మేమే. మీరు భరించేది కిలోకు రూ.10 మాత్రమే. ఈ విషయంలో మోడీ ప్రభుత్వం గొప్పదా? రాష్ట్ర ప్రభుత్వం గొప్పదా? అయినా కేంద్ర సహకారంపై ఎందుకు నోరు విప్పరు? జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ ఒక్కటైనయ్. మజ్లిస్ ను గెలిపించేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ చేయడం లేదు. ఈ మూడు పార్టీల కుట్రలను తెలంగాణ సమాజం గమనించాలి.