హైదరాబాద్: రాష్ట్రంలోని 3.50 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాల (SHGs) మహిళలకు రూ.304 కోట్ల వడ్డీ లేని రుణాలను రేపు పంపిణీ చేయనున్నట్టు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka Mallu) తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ చీరెల పంపిణీ పురోగతి, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వడ్డీ లేని రుణాల పంపిణీ అంశంపై సోమవారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఎస్ రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.
Read Also: Petrol: ఇంధన పరిరక్షణ అవార్డులకు దరఖాస్తులు

మూడవ విడత రుణాల పంపిణీ కార్యక్రమం
రాష్ట్ర పంచాయితీ రాజ్, మహిళా సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ములుగు జిల్లా నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో మూడవ విడత వడ్డీ లేని రుణాలను 25వ తేదీ మంగళవారం నాడు ఉదయం 11 గంటలకు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కార్యక్రమంలో పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధిత శాసన సభ్యులు, ప్రజా ప్రతినిధులు తప్పక హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్న ఈ వడ్డీ లేని రుణాలతో మహిళల్లో ఒక ధైర్యం, నమ్మకం, ఆత్మవిశ్వాసం ఏర్పడిందని అన్నారు. ఈ వడ్డీ లేని రుణాల మొత్తం నేరుగా మహిళల బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నందున ఎవరెవరికి ఎంత మొత్తం అందిందో సభ్యులకు స్పష్టంగా తెలియజేయాలని అన్నారు.
ఇందిరమ్మ చీరెల పంపిణీ, ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్లు
రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం అద్భుతంగా సాగుతోందని ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర పంచాయితీ రాజ్, మహిళాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క (Dhanasari Anasuya Seethakka) మాట్లాడుతూ, తమకి నాణ్యమైన ఇందిరమ్మ చీరలను అందించడం పట్ల రాష్ట్రంలోని మహిళలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. నాణ్యమైన చీరలను అందయించడంతో పాటు పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలను కూడా అందించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ, జిల్లాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీని వేగవంతంగా పూర్తి చేయడం పట్ల జిల్లా కలెక్టర్లను అభినందించారు. త్వరితగతిన ఈ చీరలను పూర్తిగా పంపిణీ చేయాలని ఆదేశించారు. మంగళవారం అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించే వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి సంబంధిత జిల్లాల ఇన్చార్జి మంత్రులు, జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించే మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో లక్ష మంది విద్యార్థులకు ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్స్ నిధులు విడుదల చేయడం జరిగిందని, ఈ స్కాలర్షిప్లను సమర్థవంతంగా పంపిణీ చేయడానికి వెల్ఫేర్ విభాగాల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, జ్యోతి బుద్ధా ప్రకాష్, హౌసింగ్ ఎండి గౌతమ్, సెర్ప్ సిఇఓ దివ్య, పంచాయితీ రాజ్ కమిషనర్ సృజనలు పాల్గొన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: