హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి నిర్వహించిన సమగ్ర ఇంటింటి కుల గణన సర్వే కూడా పూర్తయింది. ఇందులో సైతం ఆశించిన సంఖ్యలో కుటుంబాలు తమ వివరాలు నమోదు చేసుకోలేదు. మొదటిసారి నిర్వహించిన కుల గణన సర్వేలో 3.56 లక్షల కుటుంబాలు వివరాలు నమోదుచేసుకోకుండా మిగిలిపోయాయి. వీరికోసం రెండోసారి సర్వే నిర్వహించినా.. 18,539 కుటుంబాలు (5.21%) మాత్రమే ఎంట్రీ చేయించుకున్నాయి.

ఇంకా 3,37,964 ఫ్యామిలీలు
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,15,71,457 కుటుంబాలు ఉన్నట్టు గుర్తించగా.. గత నవంబరు 6 నుంచి డిసెంబరు 25 వరకు జరిగిన మొదటి సర్వేలో 1,12,15,134 కుటుంబాల(96.9) వివరాలు నమోదయ్యాయి. ఇంకా 3,56,323 (3.1 శాతం) కుటుంబాలు మిగిలిపోవడంతో వారి వివరాల నమోదు కోసం ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు రెండోసారి సర్వే నిర్వహించారు. ఈ రీసర్వేలో18,539 కుటుంబాలే వివరాలు ఎంట్రీ చేయించుకున్నాయి. దీంతో రెండు సర్వేలు పూర్తయిన తర్వాత కూడా ఇంకా 3,37,964 ఫ్యామిలీలు మిగిలిపోయాయి.
కులాల లెక్కల్లో స్వల్ప మార్పులు
మొత్తంగా రెండు సర్వేల్లో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 1,12,33,673(97.08 శాతం) కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయి. సర్వే సులభంగా పూర్తయ్యేందుకు వీలుగా ప్రభుత్వం వివిధ రకాలుగా అవకాశం కల్పించింది. టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేస్తే అధికారులే ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. కుల గణన రీసర్వేలో నమోదైన18 వేలకుపైగా కుటుంబాలను అప్ డేట్ చేయడంతో కులాల లెక్కల్లో స్వల్ప మార్పులు జరగనున్నాయి. ఫస్ట్ సర్వే తర్వాత ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఎస్సీల జనాభా 17.43 శాతం (61,84,319), ఎస్టీల జనాభా 10.45 శాతం (37,05,929 ), బీసీల జనాభా 46.25 శాతం (1,64,09,179) ఉన్నట్టు పేర్కొన్నారు.