గోదావరిఖని : బీసీలపై కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, 42శాతం బీసీ రిజర్వేషన్లలో 10 శాతం ముస్లిం రిజర్వే షన్లను తీసేసి, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు (Ramchander Rao) అన్నారు. గోదావరిఖనిలోని బల్మూరి అమరేందర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ల విషయంలో ధర్నా చేపట్టారని, కామారెడ్డిలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు ప్రకటించిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఢిల్లీకి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించిన సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని పిలిచారని, మరి కర్ణాటక రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పరిస్థితి గురించి రేవంత్ రెడ్డి సిద్ధరామయ్యని అడగాలని అన్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు పదేపదే బీజేపీపై అభాండాలు వేస్తూ, తమ వైఫల్యాలన్నీ బీజేపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు 42 శాతం బీసీ రిజర్వేషన్లపై బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు భేషరతుగా మద్దతు తెలిపారని, ఆ తర్వాత బిల్లు పాస్ అయి 6 నెలలు గడిచిందని, అంతకంటే ముందు స్థానిక సంస్థల, పంచాయతీల గడువు తీరి ఏడాది గడిచిపోయిందని, అయినా స్థానిక ఎన్నికలు నిర్వహించడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ (Congress party) 42 శాతం బీసీ రిజర్వేషన్లలో 10 శాతం ముస్లిం రిజర్వేషన్లు ఇస్తామని ప్రయత్నం చేస్తోందని, దీంతో అస్కలైన బీసీలకు 42 నుంచి 32 శాతానికి పడిపోనున్నాయని అన్నారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటోందని, కానీ ఆ 42 శాతాల్లో 10 శాతం ముస్లింలను చేర్చి, బీసీ జాబితాలోకి మతపరమైన రిజర్వేషన్లను చొప్పించడం ద్వారా అస్కలెన బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తోందని అన్నారు.

గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం 4 శాతం రిజర్వేషన్లు ముస్లింలకు ఇచ్చి, బీసీ రిజర్వేషన్లను కుదించిందని, దీనిపై కేసు ఇంకా కోర్టులో పెండింగ్లో ఉందని అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 10 శాతం రాజకీయ ముస్లిం రిజర్వేషన్లు పెంచి బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు రానివ్వకుండా కుట్ర చేస్తోంది. గతంలో హెచ్ఎంసిలో 50 బీసీ రిజర్వ్ డివిజన్లలో 35 పైగా సీటు ఎంఐఎం పార్టీ గెలిచిందని, దీంతో అస్కలైన బీసీలకు తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో బిజెపి జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, మాజీ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కోమల్ల మహేష్, బిజెపి రాష్ట్ర నాయకులు గోమాస శ్రీనివాస్, ధర్మపురి, జక్కుల నరహరి తదితరులున్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :