తెలంగాణ రాష్ట్రంలోని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అడవిలో పశువులను మేపేందుకు వెళ్లిన దంపతులపై ఎలుగుబంటి దాడి (Bear attack)చేసి ప్రాణాలు తీసిన ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.
అడవిలో పశువుల మేపుతు దంపతులపై దాడి
సిర్పూర్ (Sirpur) మండలానికి చెందిన అచ్చెల్లి గ్రామ వాసులు దూలం శేఖర్ (45), ఆయన భార్య సుశీల (38) పశుపోషణతో జీవనం సాగిస్తున్నారు. గురువారం రోజు తన పశువులతో కలిసి సమీపంలోని పెద్దబండ అటవీ ప్రాంతానికి వెళ్లిన ఈ దంపతులు, రాత్రి వరకు ఇంటికి తిరిగిరాలేదు.
పశువులు ఇంటికి.. కానీ దంపతుల రాక లేదు
సాయంత్రానికి పశువులు మామూలుగానే ఇంటికి తిరిగివచ్చినా, శేఖర్ దంపతులు రాకపోవడంతో వారి పిల్లలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వారు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసి, వెంటనే శేఖర్కి ఫోన్ చేయడానికి ప్రయత్నించారు. అయితే, ఆయన నుంచి స్పందన రాకపోవడంతో పోలీసులు ఆశ్రయించారు.
గాలింపు చర్యలు.. సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తింపు
సీఐ సంతోష్, ఎస్సై సురేశ్ నేతృత్వంలోని పోలీస్ బృందాలు గ్రామస్తులతో కలిసి అడవిలో గాలింపు చేపట్టారు. రాత్రి 12 గంటల ప్రాంతంలో శేఖర్ సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా దంపతుల ఉన్న స్థలాన్ని గుర్తించి అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయారు.
చనిపోయిన స్థితిలో దంపతుల మృతదేహాలు
శేఖర్, సుశీల విగతజీవులుగా అడవిలో పడి ఉన్న దృశ్యం స్థానికులను తీవ్ర విషాదంలో ముంచింది. వారి మృతదేహాలను సిర్పూర్ (టి) ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.శుక్రవారం ఉదయం కాగజ్నగర్ డీఎస్పీ వహిదొద్దీన్, డీఎఫ్వో సుశాంత్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. శరీరంపై ఉన్న గాయాల ఆధారంగా ఇది అడవి ఎలుగుబంటి దాడిగా స్పష్టమైంది.
ప్రభుత్వ స్పందన: ₹20 లక్షల పరిహారం, ఉద్యోగ హామీ
ఈ దారుణ ఘటనపై మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖకు సమాచారం అందించగా, వారు బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. డీఎఫ్వో సుశాంత్ మాట్లాడుతూ, బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారం అందించే దిశగా చర్యలు తీసుకుంటామని, అలాగే కుటుంబంలోని ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: