దేశంలో నక్సల్స్ (మావోయిస్టు) సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ఆపరేషన్ కగార్’పై ఇటీవల విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పౌర సమాజం, కొన్నిప్రముఖ రాజకీయ పక్షాలు – ముఖ్యంగా బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలు – మావోయిస్టులతో చర్చలు జరపాలని, ఆపరేషన్ను తాత్కాలికంగా నిలిపి వేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఘాటైన ప్రకటన చేశారు.

ఘాటు వ్యాఖ్యలు –
కరీంనగర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తుపాకులు పట్టుకుని అమాయకులను హతమార్చినవారితో ఎలాంటి చర్చలు జరగవు. వారిని చట్టం ముందు తేవడమే లక్ష్యంగా కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోంది. ఆయుధాలు విసిరితేనే చర్చల ఊసు ఉంటుంది అని తేల్చిచెప్పారు. నక్సల్స్ హింసాత్మక చర్యల వల్ల ఎంతో మంది రాజకీయ నాయకులు, అమాయక గిరిజనులు ప్రాణాలు కోల్పోయారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ సహా ఎన్నో పార్టీల నేతలను మందుపాతరలు పెట్టి చంపారు. అమాయక గిరిజనులను ఇన్ఫార్మర్ల నెపంతో అన్యాయంగా కాల్చి చంపి ఎన్నో కుటుంబాలకు మావోయిస్టులు తీరని శోకాన్ని మిగిల్చారు అని ఆయన తెలిపారు. ఆయుధాలు వీడితే తప్ప మావోయిస్టులతో చర్చలు జరపబోమని ఆయన తేల్చిచెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు
కొన్ని రాజకీయ పక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మావోయిస్టులతో చర్చలు జరపాలని పోటీ పడుతున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ ఇలాంటి అంశాలను తెరపైకి తెస్తోందని విమర్శించారు. శాంతి భద్రతల సమస్యను రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ (NDSA) నివేదిక ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్రానికి లేఖ రాయనున్నారన్న వార్తల నేపథ్యంలో, బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. మావోయిస్టుల విషయంలో కేంద్రం కఠినంగానే వ్యవహరిస్తుందని, చర్చలకు ఆస్కారం లేదని ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది.
Read also: Telangana: సంతానం లేదన్న సాకుతో భార్యను హత్య చేసిన భర్త