ఖమ్మం (Khammam) జిల్లా వైరాలో శుక్రవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం ఒక్కసారిగా అక్కడున్న ప్రతివ్యక్తినీ హడలెత్తించింది. వైరా నదిపై నిర్మించబడిన వంతెనపై 45 అడుగుల ఎత్తు నుంచి కారు పడిపోవడం, ఆ కారుపై ఇనుప చువ్వలతో నిండి ఉన్న లారీ కూడా పై నుంచి పడిపోవడం చూసిన వారు ప్రాణాలు పోయినట్లే అనుకున్నారు. అయితే అద్భుతం అనిపించేలా, ఆ కారులో ఉన్న ఐదుగురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ప్రమాదం ఎలా జరిగింది?
విషయంలోకి వెళితే వైరా వంతెనపై ఒక లారీ ఇనుప చువ్వలతో వేగంగా వస్తుండగా, ముందు వెళ్తున్న కొబ్బరి బొండాల వ్యాన్ను ఢీకొట్టింది. అదుపుతప్పిన లారీ అక్కడికక్కడే ఎదురుగా వస్తున్న ఓ కారును గుద్దేసింది. దాంతో పాటు లారీ, కారు రెండూ వంతెనపై నుంచి లోయలోకి పడిపోయాయి. రు బోల్తా పడటం, లారీలో ఇనుప చువ్వలు ఉండటం చూసి ప్రయాణికులు పెద్ద ప్రమాదం జరిగిందని భయపడ్డారు. కానీ కారులో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు. అందులో ఉన్న ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. కారులో ఓ వృద్ధుడు ఇరుక్కొని ఉండగా పోలీసులు, స్థానికులు బయటకు తీశారు.
డ్రైవర్కు గాయాలు – ప్రమాద కారణాలు
లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలవడంతో అతడిని 108 అంబులెన్స్ ద్వారా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి ప్రధాన కారణం లారీ వేగం, బ్రేక్లు పట్టకపోవడం, లేదా డ్రైవర్ అసావధానత కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది. అక్కడికి వచ్చిన వారంతా కారులో ప్రయాణికులు మృత్యుంజయులు అంటూ క్షతగాత్రులను ఓదార్చారు. కారు పడ్డ భాగంలో మున్సిపాలిటీ చెత్త ఉండటంతో ప్రమాద తీవ్రత తగ్గిందని స్థానికులు చెబుతున్నారు. అందుకే ప్రయాణికులు తీవ్ర గాయాలతో కాకుండా స్వల్ప గాయాలతో బయటపడ్డారని చెబుతున్నారు.
Read also: Greenfield Highway : తెలంగాణలో మరో గ్రీన్ ఫీల్డ్ హైవే