తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని చెంచు గిరిజనులకు 13,266 ఇళ్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti ) ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఈ ఇళ్లను అందజేయనున్నట్టు తెలిపారు. గిరిజనుల ఆవాస సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చెంచు తెగకు చెందిన వాసులు ఆర్థికంగా, సామాజికంగా లబ్ధి పొందనున్నారు.
మున్ననూర్లో తొలి విడత మంజూరు
ఈ నిర్ణయం అమలు ప్రక్రియలో భాగంగా జూలై 7న నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మున్ననూరులో ప్రత్యేక కార్యక్రమం జరుగనుంది. ఇందులో గవర్నర్ జిష్ణుదేవ్సింగ్, సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు మొదటి విడతగా చెంచు గిరిజనులకు ఇళ్లు (Indiramma House ) మంజూరు చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి శకం మొదలవుతుందని మంత్రి పొంగులేటి అభిప్రాయపడ్డారు.
ఆసిఫాబాద్కు అత్యధిక కేటాయింపు
చెంచుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని జిల్లాల వారీగా ఇళ్లను కేటాయించారు. ఇందులో అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లాకు 3,371 ఇళ్లు మంజూరు చేయగా, అత్యల్పంగా నాగార్జునసాగర్ నియోజకవర్గానికి కేవలం 17 ఇళ్లు మాత్రమే కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా చెంచు గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాల్లో ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా గిరిజనుల జీవితాల్లో గుణాత్మక మార్పు వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
Read Also : Burley Tobacco : రాష్ట్రంలో ఊపందుకున్న బర్లీ పొగాకు కొనుగోళ్లు