లంచం ఇస్తే చాలు మీ పని ఐపోతుంది.. ఎక్కడ కావాలంటే అక్కడ భవనాలు నిర్మించుకునేందుకు అనుమతి లభిస్తుంది. అది బఫర్జోన్ అయినా.. ఎఫ్టీఎల్ అయినా లంచం ఇస్తే చాలు మీ పనైపోయినట్టే.. నిబంధనలకు పాతరేసి పర్మిషన్ ఇచ్చేస్తారు. ఇలా ఆమ్యామ్యాలకు అలవాటు పడి ఏకంగా వంద కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించాడు ఓ అధికారి. తాజాగా ఏసీబీ వలకు చిక్కాడు.
నీటిపారుదల శాఖ ఏఈఈ నిఖేష్ ఇంట్లో శనివారం ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్న ACB భారీగా ఆస్తులు గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా 30 ప్రాంతాల్లో నిఖేశ్ నివాసంతో పాటు బంధువుల ఇళ్లల్లో సోదాలు చేసి రూ.150 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించింది. రూ. లక్ష లంచం తీసుకుంటూ పది నెలల క్రితం ఆయన పట్టుబడగా, ఆయనపై ACB ఫోకస్ పెట్టింది. నిఖేశ్ కుమార్ ఇంటితో పాటు అతని బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. మొత్తం 30 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. అతనికి ఫాంహౌస్, వ్యవసాయ భూములు, భవనాలు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. కేజీల కొద్ది బంగారం కూడా గుర్తించారు. ఇప్పటి వరకు అతని ఆస్తుల విలువ రూ.150 కోట్లుగా ఉన్నట్లు గుర్తించారు.
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని నీటిపారుదల శాఖ ఏఈఈ నిఖేశ్ కుమార్ పై ఆరోపణలు వచ్చాయి. దాంతో అప్రమత్తమైన ఏసీబీ అధికారులు నిఖేష్ కుమార్ నివాసం, అతడి సన్నిహితుల ఇళ్లపై నిఘా పెట్టింది. ఈ క్రమంలో శనివారం ఉదయం ఆరు గంటల నుంచి హైదరాబాద్ లో, పలు ప్రాంతాల్లో మొత్తం 30 వరకు చోట్ల ఏసీబీ సోదాలు చేపట్టింది. ఏసీబీ దాడుల్లో భారీగా వ్యవసాయ భూములు, బిల్డింగ్స్, ఫాం హూస్ తదితర ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్, పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారని సమాచారం.