కృష్ణా నది జలాల పంపకాల విషయంలో ఆంధ్రప్రదేశ్తో నెలకొన్న వివాదం మరోసారి ముదిరింది. తెలంగాణ ప్రభుత్వం ఈ సమస్యను సీరియస్గా పరిగణిస్తూ, తాడోపేడో తేల్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ తన వాటాకు మించి నీటిని వాడుకుంటోందన్న ఆరోపణలపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కృష్ణా జలాల పంపకంపై న్యాయపరంగా బలమైన వాదనలు వినిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వైద్యనాథన్తో సమావేశమైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఈ అంశంపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి ప్రత్యేకంగా చర్చలు జరిపారు. హైదరాబాద్ జలసౌధలో జరిగిన సమావేశంలో నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏప్రిల్ 15, 16, 17 తేదీల్లో సుప్రీంకోర్టులో విచారణ జరుగనున్న నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా తన వాదనను న్యాయస్థానంలో ఉంచేలా ఏర్పాట్లు చేస్తోంది.

న్యాయబద్ధంగా తమ హక్కులను కాపాడుకోవాలన్న తెలంగాణ ధీమా
ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత కూడా కృష్ణా జలాల పంపకాలపై స్పష్టత లేకపోవడమే ఈ సమస్యకు మూల కారణంగా తెలంగాణ భావిస్తోంది. ఏపీ ప్రభుత్వం గోదావరి మరియు కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను దాటివెళ్లి వినియోగిస్తోందన్న అభియోగాలు గత కొంతకాలంగా వస్తున్నాయి. దీనిని ఇక సహించేది లేదని, న్యాయపరమైన మార్గంలో స్పష్టమైన తీర్పు కోసం తెలంగాణ పట్టుదలగా ఉందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టులో గట్టి వాదనలతో ముందుకు వెళ్లనున్న తెలంగాణ
సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ నేతృత్వంలో తెలంగాణ తగిన ఆధారాలతో కూడిన వాదనలు కోర్టులో వినిపించనుంది. ఏపీ వాదనలకు సముచితమైన బదులుతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. తెలంగాణకు న్యాయమైన వాటా లభించేలా, ఇకపై జలాల పంపకాల్లో అన్యాయాన్ని ఉపేక్షించబోమన్న స్పష్టమైన సందేశాన్ని ప్రభుత్వం ఇవ్వాలని యోచిస్తోంది. ఇది ఒక రాష్ట్ర హక్కుల కోసం జరిపే న్యాయపోరాటంగా మారనుంది.