తెలంగాణలో అకాల వర్షాలు, ఈదురుగాలులతో బీభత్సం – రైతులకు తీవ్ర నష్టం
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ అకాల వర్షాలు, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గురువారం రాత్రి నుండి శుక్రవారం వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో గ్రామాలు అతలాకుతలమయ్యాయి. ముఖ్యంగా మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని పలు మండలాల్లో తీవ్రంగా ప్రభావం చూపించింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల పాటు ఈదురుగాలులు, వర్షం చెలరేగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బయ్యారం, కొత్తపేట, బాలాజీ పేట, వెంకట్రాంపురం, నామలపాడు, మిర్యాలపెంట, కాచనపల్లి తదితర గ్రామాల్లో పెద్ద పెద్ద చెట్లు నేలకొరిగాయి. ఇండ్లపై ఉన్న రేకులు గాలికి ఎగిరిపోయాయి.రంగాపురం ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉన్న 150 ఏళ్ల పురాతన మర్రిచెట్టు వేర్లతో సహా కూలిపోవడం, ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉన్న మరొక చెట్టు కొమ్మలు విరిగిపోవడం స్థానికులను భయపెట్టింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ట్రాన్స్కో సిబ్బంది పునరుద్ధరణ చర్యలు ప్రారంభించినా, ప్రజలు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఇల్లందు-మహబూబాబాద్ జాతీయ రహదారిపై చెట్టు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొత్తపేట, ఉప్పలపాడు, బయ్యారం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. రైతులు ధాన్యాన్ని భద్రపరచేందుకు పట్టాలు కప్పినప్పటికీ, తీవ్ర గాలికి ఫలితం లేకపోయిందని వాపోయారు.

Telangana : తెలంగాణలో గాలి వాన ధాటికి రైతుల కష్టాలు పెరిగాయి
ముఖ్యంగా మామిడికాయలు రాలిపోవడంతో కౌలు రైతులకు భారీ నష్టం వాటిల్లింది. వరంగల్ జిల్లాలో రెండు గంటల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో పంటలు దెబ్బతిన్నాయి. వృక్షాలు నేలకొరిగాయి, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.ఖమ్మం జిల్లాలో బుధవారం రాత్రి కురిసిన ఈదురుగాలులతో కూడిన వర్షం అక్కడి రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. కొన్ని మండలాల్లో ధాన్యం తడిసిపోయింది. బొప్పాయి తోటలు నేలకొరిగాయి. సూర్యాతండాలో సాగు చేసిన తోటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అదే విధంగా వరి, మొక్కజొన్న, మిరప తోటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. తిరుమలాయపాలెం మండలం బచ్చోడు ధాన్యం కొనుగోలు కేంద్రంలో పట్టాలు లేకపోవడంతో రాసులు తడిసిపోయాయి. సుమారు 3,500 క్వింటాళ్ల ధాన్యం తడవడం వల్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ విధంగా అకాల వర్షాలు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైతులకు తీవ్రమైన నష్టాన్ని మిగిల్చాయి. వాతావరణం మారి మళ్లీ వర్షాలు కురిసే అవకాశముండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం కూడా వెంటనే సహాయ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
Read More : Trump: పాకిస్తాన్లో నీటి కొరతపై ట్రంప్ ట్రోల్..నిజమేనా?