తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు బీసీ నేతలతో అత్యంత కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఈ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభంకానుంది. ఈ భేటీలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు, ముఖ్య నేతలు పాల్గొననున్నారు. బీసీ వర్గాలకు మరింత న్యాయం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాలపై ఈ సమావేశంలో కీలక చర్చలు జరగనున్నాయి.ఈ సమావేశం ద్వారా బీసీ వర్గాలకు ప్రభుత్వం అందించే ప్రాధాన్యతను మరోసారి రేవంత్ రెడ్డి స్పష్టంగా తెలియజేయనున్నారు. ముఖ్యంగా, దేశంలో ఎక్కడా లేనివిధంగా కులగణనను చేపట్టడం, విద్య మరియు ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల అమలు, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు.
ప్రధానాంశాలు:
కులగణన: తెలంగాణలో అన్ని వర్గాల సమగ్ర డేటా సేకరించి, బీసీ వర్గాల అభివృద్ధికి కసరత్తు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.
రిజర్వేషన్ల అమలు: విద్య, ఉద్యోగాల్లో బీసీలకు స్థానం కల్పించేందుకు మరింత మెరుగైన విధానాలను రూపొందించేలా చర్చలు జరగనున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికలు: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ప్రాతినిధ్యం పెంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై నేతల అభిప్రాయాలను తీసుకోనున్నారు.
సంక్షేమ పథకాలు: బీసీ వర్గాల అభివృద్ధికి ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలను మరింత బలోపేతం చేయడం, కొత్త పథకాలను ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

42 శాతం రిజర్వేషన్
ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో వర్గీకరణకు చట్టబద్ధతపై ఒక బిల్లు, బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లుతో పాటుగా విద్య, ఉపాధి రంగాల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లులకు చట్టబద్ధత కల్పించనుంది. రిజర్వేషన్ల విషయం లో కేంద్రంతో పోరాటం చేయటానికి వెనుకడేది లేదని రేవంత్ టీమ్ చెబుతోంది.పెంచిన రిజర్వేషన్లు అమలు కావాలంటే మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. లేదా పార్లమెంటులో ఈ చట్టాన్ని ఆమోదింపజేసి, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలి. ఈ చట్టానికి కేంద్రం ఆమోదం తెలపకపోతే పోరాటం చేయాలని రేవంత్ ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో మిగిలిన రాజకీయ పార్టీలను కూడా ఢిల్లీకి రావాలని కోరనున్నారు. దీంతో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల ద్వారా సీఎం రేవంత్ కొత్త వ్యూహాలు అమలు చేసేందుకు సిద్దం అవుతున్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కావాలంటే పార్లమెంట్ ఆమోదం లభించాలి. అయితే అది సాధ్యం కాదు కనుక రాష్ర్ట ప్రభుత్వం కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తుంది.