తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కోసం ప్రభుత్వ విధానాలను, ప్రణాళికలను ప్రకటించేందుకు కీలకంగా మారనున్నాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలను గవర్నర్ తన ప్రసంగంలో వివరించే అవకాశం ఉంది.
బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టి విక్రమార్క
ఈ నెల 19న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో ప్రధానంగా రైతు సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు అంచనా. కొత్త ప్రభుత్వ విధానాలు, కొత్త పథకాలకు నిధుల కేటాయింపు, అభివృద్ధి ప్రణాళికలు ఈ బడ్జెట్లో ప్రతిబింబించే అవకాశం ఉంది.
బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులపై చర్చ
ఈ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులపై చర్చ జరగనుంది. ఈ రెండు అంశాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల విస్తరణ, ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో వివిధ పార్టీల మధ్య తీవ్ర చర్చలు సాగే అవకాశం ఉంది.

బీఆర్ఎస్ చీఫ్ KCR హాజరు
ఈ సమావేశాల తొలి రోజున బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) సభకు హాజరుకానున్నారు. రాజకీయంగా ముఖ్యమైన ఈ సమావేశాల్లో విపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశముంది. ప్రభుత్వ విధానాలపై విపక్షాల నుండి రసవత్తరమైన చర్చలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.