హైదరాబాద్: వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సోమవారం నల్లగొండలోని కలెక్టరేట్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉమ్మడి మూడు జిల్లాల పరిధిలోని అభ్యర్థులు నల్లగొండలోనే నామినేషన్లు వేయనున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు తీసుకోనున్నారు. ఈ నెల 11న స్క్రూట్నీ, 13న ఉపసంహరణ అనంతరం 27న పోలింగ్ నిర్వహించి మార్చి 3న ఫలితాలను లెక్కించనున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల యంత్రాంగం జిల్లాలో 200 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, ఆయా పోలింగ్ కేంద్రాల్లో 24,905 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

వచ్చే నెల 29తో ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పదవీ కాలం పూర్తి కానున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం గత నెల 29న షెడ్యూల్ విడుదల చేయగా నేడు నోటిఫికేషన్ జారీ చేయనుంది. నల్లగొండ కలెక్టరేట్లో కలెక్టర్ ఇలా త్రిపాఠి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తూ ఈ నెల 10 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
మరోవైపు.. కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నరేందర్రెడ్డిని, అంజిరెడ్డిని బీజేపీ తమ అభ్యర్థులుగా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ బీసీ కార్డుతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి, భంగపడ్డ ప్రసన్న హరికృష్ణను తమ అభ్యర్థిగా ప్రకటించేందుకు సిద్ధమైంది. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్రావు ఈ మేరకు పార్టీ చీఫ్ కేసీఆర్కు ప్రతిపాదించారని, ఆయన సోమవారం అధికారికంగా ప్రకటన చేస్తారని తెలుస్తోంది. అయితే.. బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించిన కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్సింగ్ రెబల్గా పోటీలో దిగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.