Sunita Williams : సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమిపై అడుగుపెట్టారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో 9 నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి చూస్తున్నవేళ.. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో దిగారు. స్పేస్ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ ‘ఫ్రీడమ్’ వారిని సురక్షితంగా పుడమికి తీసుకొచ్చింది.

ఏకంగా 286 రోజులు అక్కడే
సునీత, విల్మోర్లతోపాటు నాసాకు చెందిన కమాండర్ నిక్ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా ఐఎస్ఎస్ నుంచి ఇదే వ్యోమనౌకలో పుడమికి చేరుకున్నారు. అంతకుముందు- ఐఎస్ఎస్ నుంచి భూమికి వీరి ప్రయాణం నిర్దేశిత పరామితులకు అనుగుణంగా సాఫీగా సాగింది. కేవలం 8 రోజుల యాత్ర కోసం నిరుడు జూన్ 5న ఐఎస్ఎస్కు వెళ్లిన సునీత, విల్మోర్.. చివరకు ఏకంగా 286 రోజులు అక్కడే గడపాల్సి వచ్చిన విషయం తెలిసిందే.
డాక్టర్ల బృందం వైద్య పరీక్షలు
కాగా, తాజాగా భూమిపై దిగిన వ్యోమగాములను హ్యూస్ట్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలించారు. అక్కడే వారికి డాక్టర్ల బృందం వైద్య పరీక్షలు నిర్వహించింది. అంతరిక్షం నుంచి వచ్చిన నలుగురు వ్యోమగాములు ఆరోగ్యంగా ఉన్నారని నాసా తెలిపింది. అన్ డాకింగ్ నుంచి సాఫ్ట్ ల్యాండింగ్ వరకు అన్నీ అనుకున్నట్టు జరిగాయని వివరించింది. స్పేస్ ఎక్స్, నాసా సమిష్టి కృషితో వారిని భూమిపైకి తీసుకొచ్చామని తెలిపింది. ఈ యాత్రను సక్సెస్ చేయడంలో స్పేస్ఎక్స్ కీలక పాత్ర పోషించిందని నాసా ప్రశంసించింది.