మానవ జన్మ తాలూకు బంధాలు, అనుబంధాల గురించి, ఆత్మ పరమాత్మల సంబంధం గురించి సజ్జనులను, నిజ భక్తులను భగవంతుడు ఎలా ఆదరిస్తారో తన చేతల, లీలల బోధనల ద్వారా రా తెలియ చెప్పిన పురాణ పురుషుడు శ్రీకృష్ణుడు (Lord Krishna) అధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని కాపాడిన లీలా మానుష రూపుడు వాసుదేవుడు. జగమంతా తానై నిండిపోయిన జగన్నాథునికి ఆలయాలకు కొదవేమున్నది. పూరి, ద్వారక, గురువాయూరు, ఉడిపి, మథుర, బృందావనం.. ఇలా ఎన్నో క్షేత్రాలలో శ్రీగోపాల కృష్ణమూర్తి కొలువై దర్శనం ప్రసాదిస్తున్నారు. ఎన్నో ప్రాంతాలలో ఎన్నో పురాతన దేవాలయాలు ఆయన స్వగృహాలే.
పరిశీలనగా చూస్తే ప్రతి గ్రామంలోనూ ఒక శివాలయం, ఒక విష్ణు ఆలయం కనిపిస్తాయి. శివాలయం విషయంలో ఎక్కడ చూసినా లింగరాజే దర్శనమిస్తారు. కానీ విష్ణు ఆలయం విషయంలో కొంత ప్రత్యేకత కనిపిస్తుంది. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ నరసింహుడు/శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉంటారు. అవతార రూపాలు వేరైనా వైకుంఠ వాసుడు ఒక్కడే కదా! అలాంటి వాటిలో గుంటూరు పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం ఒకటి.
నాటి గర్తపురి నేటి గుంటూరు
చరిత్రలో ‘గర్తపురి’గా అనేక శాసనాలలో పేర్కొన్న నేటి గుంటూరులో ఒకప్పుడు అనేక నీటి చెరువులు ఉండేవట. నీటి గుంతలు ఉన్న ఊరుగా గర్తపురం అని పిలవబడినట్లుగా శాసనాలు తెలుపుతున్నాయి. కాలక్రమంలో గుంటూరుగా మారినట్లు తెలుస్తోంది. మహర్షులు ఈ ప్రాంతంలో మజిలీ చేసినట్లుగా వారు తమ నిత్య పూజల నిమిత్తం నిరాకారుని వివిధ రూపంలో ప్రతిష్టించుకొన్నారు అనడానికి ప్రత్యక్ష సాక్షులుగా కొన్ని పురాతన ఆలయాలు(Ancient temples) నగరంలో ఇప్పటికీ కనిపిస్తాయి. పట్టణంలో పురాతన ఆలయాలలో మొదటిదాగా పాత గుంటూరులో ఉన్న శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం గుర్తింపు పొందగా, రెండవ స్థానం శ్రీ వేణుగోపాలస్వామి ఆలయానిదే అని చెప్పవచ్చు. సుమారు వెయ్యి సవత్సరాల ఈ ఆలయంలో ద్వాపర యుగంనాటి విశేషాలకు, కలియుగ నిర్మానాలకు ప్రత్యక్ష సాక్ష్యం.
సప్త మహర్షులు
యుగాల క్రితం మానవాళికి మార్గదర్శకత్వం చేయడానికి దేవదేవుని ఆదేశం మేరకు ఏడు మంది మహర్షులను నియమించారు. వారు విశిష్ఠుడు, అత్రి, గౌతముడు.కశ్యపుడు, భరద్వాజుడు, జమదగ్ని, విశ్వామిత్రుడు. వీరంతా తమదైన శైలిలో ఆదర్శప్రాయ ఆశ్రమ జీవితాన్ని గడుపుతూ సామాన్య మానవులకు విజ్ఞాన, విద్య, పాలన, ఆధ్యాత్మిక విషయాలలో తగిన రీతిలో బోధించారు. సప్త మహర్షులలో ఒకరైన గౌతమ మహర్షి మానవులకు మార్గదర్శకం చేసే ‘మానవ ధర్మ శాస్త్రం’ అందించారు. ద్వాపర యుగంలో మహర్షి భూలోకంలోని తీర్థస్థలాల సందర్శనలో అనేక జలాశయాలతో నిండిన ఈ ప్రాంతం చేరుకొన్నారు. జలం జీవం. మానవ జాతి మనుగడకు ముఖ్యమైన వాటిలో ఒకటి నీరు. తమ నిత్య అనుష్ఠానానికి అవసరమైన పవిత్ర జలం లభిస్తున్న ఈ ప్రదేశంలో కొంత కాలం వుండాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఆరాధ్య దైవం శ్రీ మహావిష్ణువు. శ్రీమన్నారాయణ మూర్తి ధరించిన అనేక అవతారాలలో ద్వాపరం నాటికి ఆఖరిదిగా పరిగణింపదగిన జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ గోవర్ధన గిరిధారి మూర్తిని ప్రతిష్ఠించారట. శిష్య ప్రశిష్యులతో ఇక్కడ ఉన్నంత కాలం నియమంగా సేవించుకొని, తాను వెళ్ళిన తరువాత ఆలయ నిర్వహణా బాధ్యతలను స్థానిక పాలకునికి అప్పగించారట. అనేక వేల సంవత్సరాలు శ్రీ వేణుగోపాల మహర్షి పూజలు అందుకొన్నారు. ఆయనచే ప్రతిష్ఠించబడిన బృందావన విహారి విగ్రహం మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జరిగిన దేశ విభజన సమయంలో తలెత్తిన దాడులలో ఆలయం భిన్నమైనట్లు తెలుస్తోంది. ఆలయ ఉత్తర గోడ వద్ద ఉంచబడిన ఆ విగ్రహాన్ని నేటికి వీక్షించవచ్చు.
ఆలయ విశేషాలు
తొట్టతొలి ఆలయాన్ని ఎవరి నిర్మించారన్నదాని గురించి స్పష్టత లేదు. కానీ అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం ఈ ప్రాంతాన్ని పదవ శతాబ్ద కాలంలో పాలించిన చాళుక్య రాజులు నిర్మించినట్లు తెలియవస్తోంది. తదనంతర కాలంలో ఆ పరంపర కొనసాగుతూ వచ్చి పన్నెండవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన పడుగు రాజు (పండ్రియ రాజు) ప్రస్తుత ఆలయాన్ని నిర్మించినట్లుగా ఆలయంలో లభించిన శాసనాలలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.
ఈ వంశ రాజుల గురించిన సమాచారం ఆంధ్రుల చరిత్రలో లభించటం లేదు. వీరు కొండవీటి, వేంగి చాళుక్యులు దండనాదులో లేక ఈ ప్రాంత అధికారులుగానో భావించవచ్చు. ఆస్థాన మండప స్థంభాలకు ఉన్న శాసనాలు చాల వరకు వివిధ కారణాల వలన చెరిగిపోయాయి.కొన్ని జైపూర్లోని పురావస్తు శాఖ వారి సంగ్రహశాలకు, కొన్ని విజయవాడ ఇంద్రకీలాద్రి పైన ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఉన్నట్లుగా చెబుతారు.
విశాల ప్రాంగణంలో తూర్పు ముఖంగా నిర్మించిన ఆలయానికి ఎలాంటి రాజగోపురం ఉండదు. ఎత్తైన ధ్వజస్థంభం వద్ద బలిపీఠం, శ్రీ గరుడాళ్వార్ల సన్నిధి ఉంటాయి. పక్కన ప్రత్యేక సన్నిధిలో శ్రీ దక్షిణాముఖ ఆంజనేయస్వామి దర్శనమిస్తారు. ముకుళిత హస్తాలతో స్థానక భంగిమలో దక్షిణ దిశగా భక్తాంజనేయునిగా కొలువు తీరిన అంజనాసుతుడు భక్తుల మనోభీష్టాలను త్వరితగతిన నెరవేర్చేవానిగా ప్రసిద్ధి. భయ, రోగ, శత్రు పీడలను, అపమృత్యు భయాన్ని తొలగిస్తారని చెబుతారు. గోపుర గోడల పైన హనుమంతుడు, శ్రీ కృష్ణ విగ్రహాలు కూడా చెక్కబడి కనపడతాయి.
ప్రదక్షిణా పథంలో ఆలయ ముఖమండప, గర్భాలయ వెలుపలి గోడలలో సుందరమైన శ్రీ గణపతి, సాలభంజిక, శ్రీ గరుడ, శ్రీ ఆంజనేయ, శ్రీ లక్ష్మీ నరసింహ, శ్రీ రంగనాథ స్వామి, శ్రీ వైఖానస మహర్షి, శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ లక్ష్మీనారాయణ రూపాలను అద్దాలతో మూసిన అరలలో ఉంచారు.

నాగ బంధం
ముఖమండప దక్షిణ ద్వారం పక్కన గోడలో ప్రత్యేకంగా అమర్చిన ‘నాగ బంధం’ కనపడుతుంది. నాగ బంధం సహజంగా శివాలయాలలో కనపడుతుంది. తిరువనంతపురం శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ట్రావెన్కోర్ రాజులు నిక్షిప్తం చేసిన సంపద ఉంచిన గదుల ద్వారా ప్రపంచానికి నాగ బంధం గురించి తెలిసింది. నాగ బంధం అన్నది కట్టడ రక్షణ నిమిత్తం వేసే ఒక తాంత్రిక విధానం. దీని వలన చోరులు ప్రవేశించడానికి భయపడతారు. కొందరు పండితులు నాగ బంధం ‘కుండలినీ శక్తి’కి నిదర్శనం అని చెబుతారు. ఏది ఏమైనా ఇది ఎవరికీ తెలియని అర్థంకాని, బేధించలేని ఆదిశ ప్రక్రియ అని చెప్పవచ్చు. ముఖ మండప పైభాగంలో శ్రీ రుక్మిణి, సత్యభామా సమేత శ్రీ కృష్ణ పరమాత్మ వర్ణమయ శిల్పాలను ఉంచారు. మండప దక్షిణ పై భాగంలో శ్రీ శేషశయనుని రూపాన్ని ఉంచారు.
ఆలయ నైరుతిలో చిన్న సభా వేదిక నిర్మించారు. పురాణ శ్రవణానికి, ఇతర గోష్టి కార్యక్రమాలకు ఉపయుక్తం ఈ వేదిక. ఉత్తరాన గోపికా సమేత గోవిందుని నాట్య మండపం కనిపిస్తుంది. బృందావనంలో రాసక్రీడలు ఆడిన విధానంలో అనేక కృష్ణ రూపాలు గోపికలతో నృత్యం చేస్తున్న విగ్రహాలను చక్కగా తీర్చిదిద్దారు. ఇక్కడే శ్రీ గౌతమ మహర్షి ప్రతిష్టిత పురాతన విగ్రహాన్ని చూడవచ్చు. ప్రాంగణంలో యాగశాల దర్శించుకోవచ్చు.
ప్రదక్షిణ పూర్తి చేసుకొని ఆలయ అంతర్భాగంలోకి ప్రవేశిస్తే స్థంభాలకు చెక్కిన శాసనాలు, వివిధ రూపాలను చూడవచ్చు. ముఖ లేదా ఆస్థాన మండపం ఎత్తు తక్కువగా ఉండి అనేక శాసనాలతో నిండిన రాతి స్తంభాల మీద నిర్మించబడినది. మండపానికి అనుసంధానంగా మూడు సన్నిధులు ఉంటాయి. దక్షిణం వైపున ఉన్న సన్నిధిలో గాయక భక్తులైన పన్నెండు మంది ఆళ్వారులు కొలువై ఉంటారు. వీరు గానం చేసిన పాశురాలు ద్వారా మనం నూట ఎనిమిది శ్రీ వైష్ణవ దివ్య దేశాలను దర్శించుకోగలుగుతున్నాం. వీరిలో ఒక స్త్రీ మూర్తి కూడా ఉన్నారు. ‘ఆండాళ్’ లేదా ‘గోదా దేవి’ అని పిలవబడే ఈమె సాక్షాత్తు భూదేవి అంశ అని విశ్వసిస్తారు. ఆండాళ్ గానం చేసిన ‘తిరుప్పావై’ కీర్తనలను ధనుర్మాసంలో అన్ని వైష్ణవ ఆలయాలలో గానం చేయడం రివాజు.
ఆస్థాన మండపం తరువాత చిన్న అర్ధ మండపం, ఆ తరువాత ఉన్న గర్భాలయంలో ప్రధాన అర్చనామూర్తి శ్రీ వేణుగోపాల స్వామి చక్కని అలంకరణతో నేత్ర పర్వంగా భక్తులకు దర్శన మిస్తారు. గమనించవలసిన అంశం ఏమిటంటే శ్రీ వేణుగోపాల స్వామి చతుర్భుజునిగా ఉండటం. వెనుక హస్తాలలో శంఖు, చక్రాలను, ముందరి చేతులతో మురళిని ధరించిన ఇలాంటి రూపం అరుదుగా కనిపిస్తుంది. ఇలాంటి మూర్తిని సుళ్ళూరుపేటకు సమీపంలోని మన్నారు పోలూరు గ్రామంలో ఉన్న మరో అరుదైన శ్రీ జాంబవతి సమేత శ్రీకృష్ణ స్వామి ఆలయంలో దర్శించుకోవచ్చు. పేరు మురళీధరుడైనా లేక శ్రీరామచంద్ర మూర్తి అయినా మూలవిరాట్టు శ్రీమన్నారాయణునిగా చతుర్భుజాలతో కొలువైన ఆలయాలు కేరళలో అధికంగా కనపడతాయి.
అలంకార ప్రియుడు శ్రీ మహావిష్ణువు. ఏ వైష్ణవ ఆలయంలో చూసినా మూలవిరాట్టు, పరివార దేవతలు రమ్యమైన పుష్ప, ఆభరణ, పట్టు పీతాంబరాలు ధరించి నేత్రపర్వంగా దర్శనమిస్తారు. ఈ క్షేత్రంలో కూడా స్వామివారు నయానందకరమైన అలంకరణలో భక్తవత్సలునిగా దర్శనం ప్రసాదిస్తారు. నిత్య పూజలతో పాటు ధనుర్మాస పూజలు, వైకుంఠ ఏకాదశి, శ్రీ కృష్ణాష్టమి, హనుమజ్జయంతి పర్వ దినాలతో పాటు ఇతర పర్వదినాలలో ఎందరో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ప్రతి రోజూ నియమంగా పూజాదికాలు జరుగుతాయి.
ఈ ఆలయం సమీపంలో శ్రీ అంకాలమ్మ తల్లి, శ్రీ గుంటి విఘ్నేశ్వర, శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయాలు సైతం ఉన్నాయి. ఉత్తరం దిక్కులో ఉన్న ఉపాలయంలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు ఉపస్థిత భంగిమలో రమ్యమైన అలంకరణలో మాతృమూర్తికి మూల రూపంగా కొలువై ఉంటారు. గుంటూరు బస్సు స్టాండ్కు దగ్గరలో శ్రీ బ్రహ్మానంద రెడ్డి స్టేడియంకు చేరువలో పాత గుంటూరులోకి ప్రవేశించే ముందు యెర్ర చెరువు పక్కనే ఉంటుందీ ఈ చారిత్రక ప్రసిద్ధి చెందిన ఆలయం.
Read also: hindi.vaartha.com
Read also: