పావన కృష్ణవేణి తీరాలు
పావన కృష్ణవేణి తీరాలు ఎన్నో పవిత్ర పుణ్య తీర్థ క్షేత్రాలకు నిలయాలు. ముఖ్యంగా మన రాష్ట్రంలో యుగాల నుండి నెలకొనివున్న పరంధాముని దివ్య ధామాలు పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి. సర్వాంతర్యామి స్వయంవ్యక్తిగా, మహర్షుల పూజల (Pujala) నిమిత్తం ప్రతిష్ఠించుకొన్న అర్చారూపాలు, మహారాజులు క్షేత్రప్రాధాన్యతలను తెలుసుకొని నిర్మించిన ఆలయాలు ఇలా వివిధ రకాల క్షేత్రాలు మనకి కనిపిస్తాయి. ఈ తీర్థ క్షేత్రాలతో ముడిపడి క్షేత్ర గాథలు కూడా యుగాల నాటిని కావడం, అవి వివిధ పురాణాలలో ప్రస్తావించబడి ఉండటం విశేషం. అలాంటి ఒక విశేష ఆలయం రేపల్లె పట్టణానికి సమీపంలో నెలకొని ఉన్నది.
పరమేశ్వరుడు మానవ రూపంలో అవతరించి దుష్ట శిక్షణ చేసి శ్రీ ముక్తేశ్వరునిగా కొలువు తీరిన దివ్య ధామం కృష్ణా నదీ తీరంలో ఉన్న మోర్తోట (Morthota) గ్రామంలో నెలకొని ఉన్నది. స్వామి ఇక్కడ కొలువు తీరడం వెనుక ఉన్న గాథ తెలుసుకొందాం. దాని కన్నా ముందు ఈ విషయం కూడా మనం తెలుసుకోవాలి.
ఏ క్షేత్రానికైనా నాలుగు విశేషాలు ఉంటాయి. ఒకటి: తీర్థ విశేషం; రెండు: క్షేత్ర విశేషం; మూడు: క్షేత్ర గాథా విశేషం; నాలుగు: మూర్తి విశేషం.
తీర్థ విశేషం
క్షేత్రానికి సమీపంలోని జీవ నది లేదా నది పవిత్రత తీర్థ విశేషంగా చెబుతారు. నది లేని పక్షంలో ఆలయ పుష్కరిణి గొప్పదనం గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే పురాతన ఆలయాల పుష్కరుణులలో అధిక శాతం దేవతలు, మహర్డులు ఏర్పాటు చేసినవి కావడం చెప్పుకోవలసిన అంశం. పుష్కరణిలో స్నానం చేయడం భక్తుల శరీర అనారోగ్యం, జన్మజన్మల పాప కర్మలను తొలిగించేదిగా చెబుతారు.
క్షేత్ర విశేషం
లోకాలను పాలిస్తూ రక్షించే దేవదేవుడు ఆ క్షేత్రంలో కొలువు తీరడానికి గల కారణం, క్షేత్రంలో నడయాడిన పుణ్య పురుషుల వివరాలు, క్షేత్రానికి గల ప్రాధాన్యత, ఆలయ ప్రత్యేకతలు, పరివార దేవతల సన్నిధులు ఇవన్నీ క్షేత్ర విశేషాల కిందకు వస్తాయి.

మూర్తి విశేషం
క్షేత్రంలో కొలువు తీరిన అంతర్యామి రూప విశేషాలు విశేషంగా భక్తులను ఆకర్షిస్తాయి.రక రకాలుగా ఉంటాయి. అవి భక్తులలో శాశ్వత ఆధ్యాత్మిక అనుభూతులను నెలకొల్పుతాయి. చెరగని దర్శనానుభూతులను ప్రసాదిస్తాయి.
క్షేత్ర గాథ
అన్నిటికన్నా క్షేత్ర గాథ ప్రధానమైనది. గతంలో నదీతీరాలు ముని ఆశ్రమాలుగా, గురుకులాలుగా ప్రసిద్ధి చెందాయి. కారణం వారి నిత్య అనుష్టానానికి, పూజలకు ఇతర కార్యక్రమాలకు జలం చాలా అవసరం. ఈ కారణంగా వారు ఆశ్రమాలను నదీ తీరంలో నెలకొల్పుకొనేవారు. అలా పూర్వం అనేక మంది మునులు నివసించిన ప్రదేశంగా “మునుల తోట”గా పిలవబడిన ఈ ప్రదేశం కాలక్రమంలో “మోర్తోట”గా పిలవబడుతోంది.
సీతాదేవిని అపహరించుకొని పోయి లంకకు చేటు తెచ్చిన రావణాదులు రామ రావణ యుద్ధంలో అశువులు బాసారు. కానీ ఒకే ఒక్క రాక్షస యువతి ఎలాగో తప్పించుకొని దేవతల పట్ల విపరీతమైన పగ ప్రతీకారం పెంచుకొని మునివాటికల మీద దాడి చేస్తూ, యజ్ఞయాగాదులకు ఆటంకం కలిగించేదట. జనావాసాల మీద కూడా దాడులు చేస్తూ ప్రజలను ఇక్కట్లకు గురి చేయసాగింది.
రాక్షసి అకృత్యాలను సహించలేక మహర్షులు మహేశ్వరుని తమను కాపాడమని ప్రార్థించారట. అదే సమయంలో జ్ఞాన యోగి సుచరిత దంపతులు దత్తాత్రేయుని ప్రార్థిస్తున్నారు. పరమేశ్వరుడు మహర్షులతో త్రిమూర్తి అంశతో జ్ఞానయోగి దంపతులకు జన్మించే కుమారుడు రక్కసిని సంహరించగలడని తెలిపారట.
కొద్దికాలంలోనే యోగి దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. త్రినాథుడు అన్న పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచసాగారు. చిన్నవయస్సులో సమస్త విద్యాలను అభ్యసించిన త్రినాథుని జన్మ రహస్యం తెలుసుకొన్న రక్కసి ఒకరోజు అతని మీదకు దాడి చేసినదట.
లోకకంటకి అయిన రాక్షసితో భీకర పోరాటం జరిగింది. తనకు మరణం తప్పదని గ్రహించిన రక్కసి త్రినాథుని తన తప్పులను క్షమించి పుణ్యలోకాలకు ప్రసాదించమని ప్రార్థించడంతో అనుగ్రహించారు త్రినాథుడు. అలా ఎన్నో పాప కర్మలు చేసిన రాక్షసికి ముక్తిని ప్రసాదించిన త్రినాథుడు పావన కృష్ణా నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న “మోర్తోట”లో శ్రీ ముక్తేశ్వర స్వామి అన్న పేరుతో లింగ రూపంలో కొలువు తీరారట.
అలా కొలువు తీరిన స్వామిని అన్ని పాపాలను తొలగించి ముక్తిని ప్రసాదించేవానిగా శ్రీ ముక్తేశ్వరునిగా కొన్ని శతాబ్దాలుగా ప్రజలు కొలుస్తున్నారు. కాకతీయుల కాలంలో తొలి ఆలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తోంది. అనంతరం ఎందరో పాలకులు స్వామివారిని సేవించుకొన్నారు. ప్రస్తుతం ఆలయానికి రాచూరు జమీందార్లు వంశ పారంపర్య ధర్మకర్తలుగా ఉన్నారు.
ఆలయ విశేషాలు
భారతదేశంలోని మూడవ అతి పెద్ద నదిగా పేరొందిన కృష్ణ మహారాష్ట్ర రాష్ట్రంలోని పశ్చిమ కనుమలలో మహాబలేశ్వర్ వద్ద జన్మించి పధ్నాలుగు వందల కిలోమీటర్ల ప్రవాహ మార్గంలో లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తోంది. కోట్లాది మంది ప్రజల దాహార్తిని తీరుస్తోంది. చివరగా మన రాష్ట్రంలోని కృష్ణా జిల్లా హంసలదీవి వద్ద సాగరునితో సంగమిస్తుంది. మరో విశేషం “కృష్ణవేణీ మహత్యం” లో కృష్ణా నది శ్రీ మహావిష్ణువు పాదాల నుండి ఉద్భవించిందని పేర్కొన్నారు.
మానవ జీవితాలు సుఖవంతంగా సాగడానికి నీరు అత్యంత ఆవశ్యకం. అందువల్ల నదులను కన్న తల్లితో సమానంగా భావిస్తాం. నేటి ప్రస్తుత పరిస్థితులలో నీటిని జాగ్రత్తగా వాడవలసిన అవసరం, కాలుష్యానికి దూరంగా ఉంచడం మనందరి బాధ్యత. మహాక్షేత్రం వారణాసి గంగానది ఉత్తర తీరాన నెలకొని ఉంటుంది. అపర కైలాసం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో, సప్త ముక్తి క్షేత్రాలలో ఒకటి వారణాసి, సర్వేశ్వరుడు స్వయంగా నడయాడే పరమ పవిత్ర క్షేత్రం.

ఈ కారణంగా ఏ నదికైనా ఉత్తర తీరాన నెలకొని ఉన్న శైవ క్షేత్రాల సందర్శన కాశీ సమాన ఫలితం ఉంటుందని విశ్వసిస్తారు. అందువలన ఆ క్షేత్రాలను అన్నింటినీ దక్షిణ కాశీ అని పిలుస్తారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అనేక క్షేత్రాలు ఇలాంటి గౌరవాన్ని పొందుతున్నాయి.
మిగిలిన ఆలయాలకు మోర్తోట శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయానికి ఉన్న తేడా ఏమిటంటే మిగిలిన ఆలయాలు ఒడ్డున లేదా ప్రవాహానికి కొంత దూరంగా ఉంటాయి. కానీ ఈ ఆలయం నది ప్రవాహంలో ఉండటం విశేషం. ఆలయం తూర్పు ముఖంగా ఉంటుంది. కానీ తూర్పు నుండి ప్రవేశించలేం. ఎందుకంటే నదీ ప్రవాహం ఉంటుంది. పడమర, దక్షిణం, ఉత్తరం పక్క నుండి ప్రాంగణంలోకి వెళ్లవచ్చు.
తూర్పు వైపున ఉన్న మండపంలో ధ్వజస్థంభం, నవగ్రహ మండపం కనిపిస్తాయి. అక్కడ నిలబడి చూస్తే ఒక పక్క గలగలా పారే కృష్ణమ్మ మరో వైపున గర్భ గృహంలో సర్వేశ్వరుడు ఏకకాలంలో దర్శనమిస్తారు. ముఖమండపానికి అనుబంధంగా మూడు సన్నిధులు కనిపిస్తాయి.
దక్షిణం పక్క ఉన్న సన్నిధిలో శ్రీ వీరభద్రస్వామి చక్కని అలంకరణలో రుద్రాక్ష మాలలు ధరించి స్థానక భంగిమలో దర్శనమిస్తారు. ఉత్తరం పక్కన ఉన్న సన్నిధిలో శ్రీ పార్వతీదేవి సర్వాభూషిత అలంకారితగా నేత్ర పర్వంగా ఉప స్థిత భంగిమలో కొలువై ఉంటారు. అమ్మవారి సన్నిధికి వెలుపల రామదూత, రుద్రావతారమైన శ్రీ ఆంజనేయస్వామి కొలువై కనపడతారు.
మధ్యలో ఉన్న గర్భాలయంలో శ్రీ ముక్తేశ్వర స్వామి స్వర్ణ మండపంలో చిన్న పానువట్టం మీద చిన్న లింగరూపంలో చందన, కుంకుమ, విభూతి లేపనాల మధ్య సుందర వర్ణ పుష్ప అలంకరణతో నయనానందకరంగా దర్శనం ప్రసాదిస్తారు. ఆలయానికి వెలుపల కొద్దీ దూరంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి సన్నిధి కనపడుతుంది. పక్కనే అపర కర్మల భవనం కూడా ఉంటుంది.

ఇన్ని సారూప్యాలు ఉండటం వలన శ్రీ ముక్తేశ్వర స్వామి కొలువు తీరిన మోర్తోటను “దక్షిణ కాశీ” అని పిలుస్తారు. స్వామి వారిని శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి అని పిలుస్తారు. కృష్ణ, గోదావరి తీరాలలో నెలకొని ఉన్న ఆలయాలను ఇదే విధంగా సంభోదిస్తారు. దీనికి ముఖ్యకారణం క్షేత్రాల పక్కన జీవనదులు ప్రవహించడం! జలం అంటే గంగ కదా! ఎదురుగా ప్రవహిస్తోంది. ప్రత్యేకంగా గంగాదేవి సన్నిధి ఉండదు.
పుణ్య తీర్థ క్షేత్ర విశేషాలు
అందుకే ఈ క్షేత్రాలను పుణ్య తీర్థ క్షేత్రాలు అని పిలుస్తారు. ఈ నదులలో స్నానం చేసి దైవదర్శనం చేసుకొంటే అత్యంత పుణ్యప్రదం అని పురాణాలు తెలుపుతున్నాయి. ఈ భాగ్యం పొందడానికి మహర్షులు తన ఆశ్రమాలను నదీతీరాలలో నెలకొల్పుకొనేవారు. కృష్ణానదీ జలాల మీద నుండి వీచే చల్లని గాలులు ఒక వైపు, మరో వైపు ఆలయం నుండి వినిపించే వేదమంత్రాల ధ్వని తరంగాలు భక్తులకు మరువలేని మరపురాని ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదిస్తాయి.
విద్వాంసులైన వేదపండితుల ఆధ్వర్యంలో నిత్యం అభిషేకాలు, అర్చనలు, అలంకరణలు, హారతులు, ఆరగింపులు జరుగుతాయి. శ్రీ వినాయక చతుర్థి, శ్రీ సుబ్రహ్మణ్య షష్టి, శ్రీదేవీ నవరాత్రులు, అష్టమి రోజున శ్రీ వీరభద్ర స్వామి పూజలు, కార్తిక మాస పూజలు, మహాశివరాత్రి మొదలైన ఉత్సవాలు విశేషంగా నిర్వహిస్తారు.
భక్తులకు అమితమైన ఆధ్యాత్మిక అనుభూతిని అనుగ్రహించే శ్రీ ముక్తేశ్వర స్వామి కొలువైన దివ్యక్షేత్రం రేపల్లె పట్టణానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో కృష్ణానదీ తీరంలో నెలకొని ఉన్నది. బస్సు సౌకర్యం లేదు కానీ ఆటోలు లభిస్తాయి. సొంత వాహంలో కూడా రేపల్లె, గుంటూరు, విజయవాడ, మచిలీపట్టణం నుండి సులభంగా చేరుకోవచ్చు. వసతి భోజన సౌకర్యాలు రేపల్లెలో లభిస్తాయి.
వెళ్లే దారిలో వచ్చే “నల్లూరు” గ్రామంలో కూడా ఒక పురాతన శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయం, మరొక శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు. మోర్తోట ఆలయ సమీపంలో ఆట విడుపుగా నదిలో ప్రయాణించడానికి సమీప లంక గ్రామాలను చూడటానికి పడవ సౌకర్యం కూడా లభిస్తుంది. మన రాష్ట్రంలో మారుమూల గ్రామాలలో ఉన్న ఆలయాలను సందర్శిద్దాం. మన ఆలయాల గొప్పదనాన్ని ప్రపంచానికి పరిచయం చేద్దాం.
Read also: hindi.vaartha.com
Read also: