సరైన సమాచారం అందుబాటులో లేకపోవడం వల్ల కొన్ని దేవాలయాలు వెలుగులోకి రావడం లేదు. అలాంటి ఒక ఆలయం విజయవాడ (Vijayawada) నగరం నడిబొడ్డున ఉన్నది అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇంద్రకీలాద్రి మీద కొలువై ఉన్న అమ్మలగన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మ మొదట ఇక్కడే కొలువై ఉండేదన్నది క్షేత్ర పురాణం. గుంటూరు (Guntur) నుండి వస్తున్నప్పుడు వారధి మీద నుండి ఎదురుగా చూడండి. ఈసారి ఎత్తైన కొండ మీదకు వెళ్లే దారి పైన ఆలయం కనపడతాయి. అదే శ్రీ దుర్గాభవానీ దేవి కొలువైన ధనకొండ.
ఒకప్పుడు మొఘల్ రాజు విడిది చేసిన ప్రదేశం కావడం వలన దీనిని మొఘల్రాజపురం అనిపిలుస్తారు. ఒకానొక సమయంలో ఊరికి దూరమేమో కానీ నేడు ప్రధాన వ్యాపార, విద్యాసంస్థల, గృహాల సముదాయంతో నిండి ఉంటుంది మొఘల్రాజపురం. సరిగ్గా అక్కడే ఎత్తైన ధనకొండ మీద శ్రీ దుర్గాభవాని కొలువైన వృత్తాంతం ఏమిటో తెలుసుకొందాం.
క్షేత్రగాథ
సుమారు రెండు వందల సంవత్సరాలకు పూర్వం ఇదంతా అటవీ ప్రాంతం. పశువుల కాపర్లు తమ పశువులను మేత కోసం కొండ పరిసర ప్రాంతాలకు తీసుకొని వెళ్లేవారట. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా పశువులు ఇటూ అటూ వెళుతుంటాయి కదా! అలా కొన్ని పశువులు కొండ పైభాగానికి వెళ్లి పోయాయట. వాటిని కాచే బాలుడు వెతుక్కుంటూ తాను కూడా పైకి వెళ్ళాడట.
ప్రస్తుతం అమ్మవారు కొలువై ఉన్న గుహ ప్రాంతానికి వెళ్లేసరికి అతనికి కాలి గజ్జెల శబ్దం వినిపించిందట. ఎవరూ కనపడలేదు. కానీ శబ్దం మాత్రం ఆగకుండా ఎవరో అక్కడ సంచరిస్తున్నట్లుగా వస్తూనే ఉన్నది. దాంతో భయపడిన బాలుడు పశువులను తోలుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. ఇలా పశువులు పైకి వెళ్లడం, వాటిని వెతుకుతూ బాలుడు వెళ్తుండడం కొన్ని రోజులు జరిగాయి.

ప్రతిరోజు కాలి అందెలా శబ్దం వినిపించేది కానీ ఎవరూ కనిపించేవారు కాదు. ఒక రోజున అదే విధంగా పైకి వెళ్లిన బాలునికి గుహ వద్ద ఒక మహిళ కనపడిందట. ఆమె ఎవరో తెలియకపోయినా ఆమెకు నమస్కరించాడు బాలుడు. బాలుడిని ఆమె ఆశీర్వదించి “నీకు కొండా, బంగారాన్ని ఇస్తాను. వాటిని తీసుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి పో!” అని ఓ సంచినిండా స్వర్ణాన్ని ఇచ్చిందట.
బాలుడు బంగారు మూట తీసుకొని కిందకి వెలుతూ కుతూహలం ఆపుకోలేక వెనక్కి తిరిగి… చూశాడట. అప్పటివరకు కనిపించిన స్త్రీమూర్తి గుహలో శిలగా మారిపోయిందిట. ఇల్లు చేరిన బాలుడు బంగారాన్ని చూపించి తల్లితండ్రులకు విషయాన్ని తెలియజేశాడు. అందరూ కలిసి పైకి వెళ్లి చూడగా గుహలో శ్రీచక్ర రూపంలో అమ్మవారు దర్శనమిచ్చినట్లు కథనం. రూపం లేకపోయినా శ్రీచక్రంలో అమ్మవారి రూపం కళ్లు, పాదాలు స్పష్టంగా కనిపించాయి. అప్పటి నుండి గ్రామస్థులు ప్రతి దసరాకు జాతర నిర్వహించి, అమ్మవారికి పూజలు చేసేవారట. ఆ సమయంలో ఆలయానికి వెళ్లడానికి సరైన దారి ఉండేది కాదట. 1987వ సంవత్సరంలో స్థానిక భక్తులు, కొందరు యువకులు కలిసి దారి ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
అసలు స్థానం
శ్రీ దుర్గా భవాని దేవి ఇక్కడ శిలా రూపం ధరించడానికి ముందుగానే ఇక్కడి నుండి ఇంద్రకీలాద్రికి వెళ్లిపోయారని ఆలయ గాథ తెలియజేస్తోంది. కానీ నేటికి గజ్జెల చప్పుడు ఆలయ పరిసరాలలో వినిపిస్తుంది అని అంటారు. ఇంద్రకీలాద్రి మీద శ్రీ కనకదుర్గాదేవి సౌమ్య రూపిణి. కానీ ధనకొండ మీద ఉగ్ర రూపం. ఆమెను శాంతింపచేయడానికి విశేష అర్చనలు జరుపుతారు. అమ్మ భక్తసులభురాలు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం. మెట్ల మార్గం ఏర్పడిన తరువాత అమ్మవారి దర్శనానికి వచ్చే సంఖ్య పెరగసాగింది. గతంలో శుక్ర, ఆదివారాలలో పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని పూజించుకొని పొంగలి వండి నివేదన చేసేవారు. నేడు ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు.
ఆలయ విశేషాలు
పర్వత పాదాల నుండి మెట్ల మార్గం ఉన్నది. మొక్కుబడి అంటే మెట్లకు పసుపు-కుంకుమ పెట్టాలనుకున్న భక్తులు ఆ మార్గంలో వస్తారు. మెట్లు నిటారుగా ఉంటాయి. సాధారణ భక్తులు కొండ సగం వరకూ మోటార్ సైకిల్ మీద లేదా ఆటోలో చేరుకోవచ్చు.
అక్కడి నుండి కొన్ని మెట్లు ఎక్కితే అక్కడ శ్రీ గణపతి, శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వస్తుంది. ఆదిదంపతుల కుమారులకు ప్రణమిల్లి ముందుకు కదిలితే తొమ్మిది మలుపులు దారి ప్రధాన ఆలయానికి దారి తీస్తుంది. తొలి మలుపు దగ్గర స్వాగత తోరణం, శ్రీ గణపతి శ్రీ కుమార స్వామి ఉంటారు. ప్రతి మలుపు దగ్గర అమ్మవారి వివిధ రూపాలైన శ్రీ త్రిపుర సుందరి దేవి, శ్రీ రేణుకాదేవి, శ్రీ గాయత్రీ దేవి, శ్రీ దుర్గా దేవి, శ్రీ లక్ష్మీ దేవి, శ్రీ మహిసాసుర మర్ధిని, శ్రీ సరస్వతి దేవి విగ్రహాలను ఉంచారు. తొమ్మిదవ మలుపు దగ్గర శ్రీ అభయ ఆంజనేయ స్వామి దక్షిణాముఖునిగా దర్శనమిస్తారు. పక్కనే నాగదేవతల సన్నిధి. సహజంగా కొండ ఎక్కేటప్పడు ఆయాసపడటం, కాళ్ళు నొప్పులు పుట్టడం జరుగుతాయి. కానీ ఇక్కడ నిర్మించిన మార్గం అలాంటి ఇబ్బందులు లేకుండా వృద్ధులు, భారీకాయులు కూడా సులభంగా ఎక్కే విధంగా ఉంటుంది.

కొండను తొలిచి గుహాలయానికి ముఖమండపం నిర్మించారు. ఆలయ విమానశిఖరం, కలశ స్థాపన కూడా చేశారు. గర్భాలయంలో శ్రీ చక్ర రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. పూజలకు, అలంకారాలకు వీలుగా శ్రీ దుర్గా భవానీ విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగింది. అన్ని పూజలు ఆ విగ్రహానికే జరుగుతున్నాయి. గర్భాలయానికి ఇరుపక్కలా రెండు విగ్రహాలను ఏర్పాటు చేశారు. గర్భాలయానికి వెలుపల ధ్వజస్థంభం, పక్కనే అమ్మవారి సింహ వాహనం కనిపిస్తాయి. ఆలయానికి వెలుపల భక్తులు కూర్చోవడానికి వీలుగా విశాలమైన మండపాలను నిర్మించారు. దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. మంగళ, శుక్ర, ఆదివారాలలో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే ఈ ఆలయం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు తిరిగి సాయంత్రం అయిదు గంటల నుండి ఏడు గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది.
ముఖ్యంగా అమ్మవారు ఐదోతనాన్ని కాపాడే దేవతగా, సంతానాన్ని ప్రసాదించే అమ్మగా, ప్రమాదాల బారి నుండి కాపాడే తల్లిగా ప్రసిద్ధి. పర్వత పైభాగం నుండి చూస్తే విజయవాడ నగరం దూరంగా ప్రవహిస్తున్న కృష్ణా నది మనోహరంగా కనిపిస్తాయి. ఆలయంలో ప్రతి శుక్రవారం, ఆదివారం భక్తులకు అన్నప్రసాద వితరణ సేకరించిన విధుల ద్వారా ఏర్పాటు చేశారు. చిత్రమైన విషయం ఏమిటంటే ఆది దంపతులది అర్ధనారీశ్వర ఏకరూపం. అమ్మవారితో పాటు అయ్యవారు కూడా కొలువై ఉంటారు ప్రతి క్షేత్రంలో! కానీ ఇక్కడ లింగరాజు ఉండరు.
కొండ కింద కొద్ది దూరంలో మొఘల్రాజపురం శివాలయంగా పిలవబడే శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. స్వామివారు బ్రహ్మ సూత్రం కలిగిన పెద్ద లింగ రూపంలో దర్శనమిస్తారు. పైన ఉన్న ఆలయానికి కింద ఉన్న ఆలయానికి క్షేత్రపాలకుడు రుద్రాంశ సంభూతుడైన శ్రీ ఆంజనేయుడు.

మొఘల్రాజపురంలో తప్పక చూడవలసినవి ఇక్కడ ఉన్న గుహాలయాలు
మొఘల్రాజపురం గుహలుగా పిలవబడే ఇవి మూడు భాగాలుగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరు లేక ఏడవ శతాబ్దంలో కొన్ని విష్ణుకుండిన వంశ పాలకుల పాలనా కాలంలో మిగిలినవి. ఇవి తూర్పు చాళుక్య రాజుల పరిపాలనలో నిర్మించబడినట్లుగా చరిత్రకారులు నిర్ధారించారు. వారు వీటిని జైన సన్యాసులు నివాసముండటానికి నిర్మించారని చెబుతారు.
ఈ రెండు రాజ వంశాలవారు బౌద్ధ, జైన మతాలను ఆదరించారు. ప్రస్తుతం పురావస్తు శాఖవారి నిర్వహణలో ఉన్న ఈ గుహలు తప్పక చూడవలసినవి. ధనకొండ శ్రీ కనక దుర్గమ్మ యంత్ర రూపం దర్శించుకున్న భక్తులు తప్పనిసరిగా ఇంద్రకీలాద్రి మీద కొలువు తీరిన శ్రీ కనకదుర్గను సైతం దర్శించుకొంటారు.
శ్రీ మాత్రే నమః
Read also : hindi.vaartha.com
Read also: