సూడాన్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుని పలువురి ప్రాణాలు బలయ్యాయి. మంగళవారం రాత్రి ఖార్టూమ్ సమీపంలోని వాది సీద్నా ఆర్మీ ఎయిర్ బేస్ లో ఈ ప్రమాదం జరిగింది. టేకాఫ్కు ప్రయత్నిస్తున్న సమయంలో విమానం అకస్మాత్తుగా అదుపుతప్పి కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది. ఈ దుర్ఘటనలో పైలట్తో పాటు పది మంది ప్రయాణికులు మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సమాచారం అందుకున్న సహాయ బృందాలు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.

ఫైరింజన్ల సాయంతో అదుపులోకి మంటలు
అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని, ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో గాయపడ్డ ప్రయాణికులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. విమానం పూర్తిగా ధ్వంసమైపోవడంతో మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారిందని అధికారులు తెలిపారు. శిథిలాల మధ్య ఇంకా మరికొందరు చిక్కుకుని ఉండే అవకాశముందని భావిస్తూ సహాయక చర్యలు వేగవంతం చేశారు.
టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్య
ప్రాథమిక దర్యాప్తులో, టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే ప్రమాదం సంభవించిందని అధికారులు అంచనా వేస్తున్నారు. విమాన ప్రమాదానికి గల కారణాలను పూర్తిగా విశ్లేషించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రమాదాలు పెరుగుతుండటం విమానయాన రంగంలో భద్రతా చర్యలపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందనే చర్చకు దారి తీసింది.