భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష యాత్రకు (ISS) రంగం సిద్ధమైంది.
అమెరికా ప్రైవేట్ స్పేస్ సంస్థ ‘యాక్సియమ్’ (Axiom Space) చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం ‘ఏఎక్స్-4’ మిషన్లో భాగంగా రేపు (మంగళవారం) ఆయన నింగిలోకి దూసుకెళ్లనున్నారు. స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ (SpaceX Falcon 9 rocket) ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. తద్వారా రోదసి యాత్ర చేపట్టిన రెండో భారతీయుడిగా రికార్డు సృష్టించనున్నారు. ఇంతకుముందు రాకేశ్ శర్మ, రష్యా సహకారంతో అంతరిక్షయానం చేసిన సంగతి తెలిసిందే.

కెన్నెడీ స్పేస్ సెంటర్
ఈ ప్రతిష్ఠాత్మక అంతరిక్ష యాత్ర భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:52 గంటలకు ప్రారంభం కానుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగం ద్వారా భారత్, పోలండ్, హంగేరీకి చెందిన నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (International Space Station) పంపుతున్నారు. ఈ మిషన్కు శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) పైలట్గా వ్యవహరించబోతున్నారు.
చరిత్రకెక్కనున్నారు
భారత్కు చెందిన ప్రముఖ వ్యోమగామి రాకేశ్ శర్మ రోదసి యాత్ర చేసిన నాలుగు దశాబ్దాల (1984) తర్వాత శుభాన్షు ఈ గౌరవాన్ని దక్కించుకోనున్నారు. ‘స్పేస్ఎక్స్’ సంస్థకు చెందిన ‘డ్రాగన్’ వ్యోమనౌక ద్వారా శుభాంశు శుక్లా ఐఎస్ఎస్కు చేరుకోనున్నారు. దీంతో ప్రైవేట్ రోదసి యాత్ర ద్వారా ఐఎస్ఎస్కు వెళ్లిన తొలి భారత వ్యోమగామిగా ఆయన చరిత్రకెక్కనున్నారు. నాసా సహకారంతో శుక్లా ఐఎస్ఎస్లో వివిధ శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు. పైలట్గా ఈ యాత్రలో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నానని శుక్లా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
నిజానికి మే 29నే ఈ ప్రయోగం జరగాల్సి ఉండగా వాయిదా పడింది. తొలుత ఈ ప్రయోగాన్ని జూన్ 8వ తేదీకి వాయిదా వేశారు. ఆ తర్వాత ఈ ప్రయోగం రేపటికి వాయిదా పడింది. ప్రయోగానికి ముందు సన్నాహాల్లో గుర్తించిన చిన్న సాంకేతిక సమస్య కారణం మిషన్ను వాయిదా వేసినట్లు అమెరికాకు చెందిన వాణిజ్య మానవ సహిత అంతరిక్షయాన సంస్థ యాక్సియమ్ స్పేస్ (Axiom Space), నాసా (NASA) సంయుక్తంగా ప్రకటించాయి.
Read Also:Yunus: వచ్చే ఏడాది ఏప్రిల్లో బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికలు: యూనస్