Vontimitta : శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు కడప జిల్లా ఒంటిమిట్టలో వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11న సాయంత్రం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు అత్యంత వైభవంగా శ్రీసీతారాముల కల్యాణాన్ని నిర్వహించనున్నారు. రాములోరి కల్యాణానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది.

దాదాపు 300 మంది శ్రీవారి సేవకులు 70 వేల లడ్డూలు
భక్తుల కోసం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం తిరుమలలోని శ్రీవారి సేవాసదన్-2లో బుధవారం శ్రీవారి సేవకుల సాయంతో తిరుమల లడ్డూలను ప్యాకింగ్ చేయించింది. డిప్యూటీ ఈవో (జనరల్) శివప్రసాద్, ఏఈవో బాలరాజు ఆధ్వర్యంలో దాదాపు 300 మంది శ్రీవారి సేవకులు 70 వేల లడ్డూలను ప్యాకింగ్ చేశారు. కాగా, ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11న జరగనున్న సీతారాముల కల్యాణోత్సవం పండుగ వాతావరణంలో భక్తులందరూ వీక్షించేలా ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సూచించారు.
టీటీడీ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం
ఈ సందర్భంగా ఒంటిమిట్టలో జరిగిన సమీక్షాలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర విభజన అయ్యాక దేవాదాయ శాఖ నుంచి ఒంటిమిట్ట ఏకశిలానగరాన్ని 2015లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీటీడీలో విలీనం చేశారని, అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో టీటీడీ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని గుర్తు చేశారు.