భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) లో కీలక నాయకత్వ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు రోజర్ బిన్నీ (Roger Binney) వయోపరిమితిని చేరుకోనుండటంతో, ఆయన పదవికి గుడ్బై చెప్పబోతున్నారు. ఈ నేపథ్యంలో బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.

వయోపరిమితి కారణంగా రోజర్ బిన్నీ పదవీ విరమణ
ప్రస్తుత అధ్యక్షుడు, 1983 ప్రపంచకప్ విజేత జట్టు సభ్యుడు రోజర్ బిన్నీ వయోపరిమితి కారణంగా త్వరలో పదవి నుంచి వైదొలగనుండగా, ఆయన స్థానంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారని తెలుస్తోంది.
బీసీసీఐ నిబంధనల ప్రకారం అధ్యక్ష పదవికి గరిష్ట వయోపరిమితి 70 సంవత్సరాలు. రోజర్ బిన్నీ ఈ ఏడాది జులై 19న తన 70వ జన్మదినోత్సవాన్ని జరుపుకోనున్నారు. దీంతో నిబంధనల ప్రకారం అధ్యక్ష పదవిలో కొనసాగే అర్హతను కోల్పోతారు. ఈ ఖాళీని భర్తీ చేసేందుకు నూతన అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు రాజీవ్ శుక్లా (Rajiv Shukla) అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తారని తెలిసింది.
తాత్కాలిక అధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా బాధ్యతలు
రాజీవ్ శుక్లా, ప్రస్తుతం బోర్డు ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అత్యవసర పరిస్థితులలో తాత్కాలిక అధ్యక్షుడిగా పనిచేసే అధికారాన్ని కలిగి ఉండటం వల్ల, బిన్నీ పదవీ విరమణ అనంతరం ఆయన తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు. ఇది సుమారు మూడు నెలల వ్యవధిలో కొనసాగనుంది.
రోజర్ బిన్నీ – క్రికెట్ నుండి అధ్యక్ష పదవి వరకు
రోజర్ బిన్నీ పేరుతో భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. రోజర్ బిన్నీ 2022లో సౌరవ్ గంగూలీ స్థానంలో బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ దిగ్గజ సీమర్ 27 టెస్టులు, 72 వన్డే మ్యాచ్ల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. తన కెరీర్లో మొత్తం 124 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా 1983లో భారత్ చరిత్రాత్మక ప్రపంచకప్ గెలవడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నమెంట్లో ఎనిమిది ఇన్నింగ్స్ల్లో 18 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచి భారత విజయంలో ముఖ్య భూమిక పోషించాడు.
Read also: Rinku Singh: ఈ నెల 8న ఎంపీతో రింకూ సింగ్ నిశ్చితార్థం