India vs England: బంతి మార్చండి- అంపైర్ల నిర్ణయంపై గిల్, సిరాజ్ అసహనం

Read Time:  1 min
India vs England: బంతి మార్చండి- అంపైర్ల నిర్ణయంపై గిల్, సిరాజ్ అసహనం
FONT SIZE
GET APP

ఇంగ్లాండ్‌ (England) తో జరిగిన తొలి టెస్టు ఐదో రోజు ఆటలో బంతి మార్పు అంశం భారత ఆటగాళ్లు మరియు ఫీల్డ్ అంపైర్ల (Field umpires) మధ్య చర్చకు దారి తీసింది. మ్యాచ్ ఉదయం సెషన్‌లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. భారత బౌలర్లు బంతి దెబ్బతిందని వాదించినా, అంపైర్లు ప్రారంభంలో మార్పుకు అంగీకరించకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తమైంది.

14వ ఓవర్ నుంచే బంతి సమస్య మొదలు

మ్యాచ్ ఐదో రోజు ఆటలో 14వ ఓవర్ వేస్తున్న సమయంలో, బంతి తన సహజమైన మెరుపును కోల్పోయిందని, సరిగ్గా స్వింగ్ కావడం లేదని మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) అంపైర్ల దృష్టికి తీసుకెళ్లాడు. వెంటనే బంతిని మార్చాలని కోరాడు. అంపైర్లు బంతిని తీసుకుని, దాని ఆకృతిని రింగుతో పరీక్షించారు. అయితే, బంతి మార్చాల్సినంతగా దెబ్బతినలేదని నిర్ధారించి, అదే బంతితో ఆటను కొనసాగించాలని సూచించారు.

తిరిగి విజ్ఞప్తి చేసిన టీమిండియా

సిరాజ్ తన తదుపరి ఓవర్‌లోనూ ఇదే విషయాన్ని మరోసారి వినిపించాడు. బంతి పరిస్థితి బౌలింగ్‌కు అనుకూలంగా లేదని, దానిని మార్చాలని మరోసారి అంపైర్‌ను కోరాడు. అంపైర్ మళ్లీ బంతిని పరిశీలించి, మార్పునకు అంగీకరించలేదు. ఈ పరిణామంతో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సిరాజ్‌తో పాటు సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ కూడా అంపైర్ల నిర్ణయం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వారు అంపైర్లతో తమ వాదనను వినిపించారు.

స్టేడియంలో ఉద్రిక్తత

22వ ఓవర్ సమయంలో (శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ చేస్తున్న సమయంలో) భారత ఆటగాళ్లు మళ్లీ బంతి మార్పు కోరారు. ఈసారి కూడా అంపైర్లు వారి అభ్యర్థనను తిరస్కరించారు. ఈ సమయంలో స్టేడియంలోని ఇంగ్లాండ్ జట్టు అభిమానులు భారత ఆటగాళ్లను ఉద్దేశించి ఎగతాళిగా అర‌వ‌డం మొదలుపెట్టారు.

చివరికి అంపైర్ల ఒప్పుకోలు

అయితే, భారత ఆటగాళ్ల నిరంతర విజ్ఞప్తుల నేపథ్యంలో తర్వాతి ఓవర్ ఆరంభంలో అంపైర్లు ఎట్టకేలకు కొత్త బంతిని అందించారు. దీంతో కొనసాగుతున్న వివాదానికి తెర పడింది.

India vs England: ఆదిలోనే హంసపాదం: తొలి మ్యాచ్‌లో పరాజయం

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.