కర్ణాటకలోని గంగావతి ప్రాంతంలో చోటుచేసుకున్న దారుణమైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనలో విదేశాలకు చెందిన పర్యాటకులు దుండగుల దాడికి గురికావడం, ఓ వ్యక్తి మృతిచెందడం, ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం జరగడం తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ, వారు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారని అధికారులు వెల్లడించారు.

ఘటన వివరాలు
గురువారం నాడు ఇజ్రాయెల్కు చెందిన ఓ యువతి, అమెరికాకు చెందిన ఓ యువకుడు, మహారాష్ట్ర నాసిక్కు చెందిన పంకజ్, ఒడిశాకు చెందిన బిబాస్ అనే వ్యక్తులు కర్ణాటకలోని గంగావతి ప్రాంతానికి పర్యటనకు వచ్చారు. వీరంతా ఆనెగుందిలోని అంబికా నాయక్ హోం స్టేలో బస చేశారు. పర్యటనలో భాగంగా రాత్రి సమయం వద్ద సణాపుర చెరువు సమీపంలోని రంగాపుర గంగమ్మ గుడి వద్ద సంగీత కార్యక్రమం నిర్వహించడంతో పాటు అక్కడ ఆనందంగా గడిపారు. ఈ సమయంలో కొందరు గుర్తు తెలియని దుండగులు ఆ ప్రదేశానికి చేరుకుని, ముందుగా పెట్రోల్ ఎక్కడ దొరుకుతుందంటూ వారితో మాటలు కలిపారని అనంతరం రూ.100 ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు. దానికి పర్యటకులు నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన దుండగులు పర్యటకులపై దాడి చేసి, పంకజ్, బిబాస్, డేనియల్ను పక్కనే ఉన్న కాలువలోకి తోసేశారు. పంకజ్, డేనియల్ ఈదుతూ ఒడ్డుకు చేరుకోగా బిబాస్ నీటి ఉద్ధృతికి గల్లంతయ్యాడు. పురుషులను కాలువలోకి తోసి మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం దుండగులు అక్కడినుంచి పారిపోయారని తెలిపారు. ప్రస్తుతం బాధిత మహిళలు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై కొప్పల్ జిల్లా పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హోంస్టే, సంఘటన ప్రదేశం పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. హోంస్టే యజమాని సహా స్థానిక ప్రజల వాంగ్మూలాలను రికార్డు చేస్తున్నారు. అత్యాచారానికి గురైన మహిళల వైద్య పరీక్షలు నిర్వహించగా, నివేదిక అధికారులకు అందినట్లు సమాచారం. సూపరింటెండెంట్ రామ్ ఎల్ అరసిద్దికి ఫిర్యాదు చేసినట్లు స్థానిక మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి నిందితుల కోసం గాలింపుచర్యలు కొనసాగుతున్నాయని నిందితులను త్వరగా అరెస్టు చేయడమే తమ ప్రాథమిక లక్ష్యమని పోలీసులు స్పష్టం చేశారు.