హైదరాబాద్: ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యకు పాల్పడటం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది. బలవన్మరణానికి పాలు పడాల్సిన అవసరం ఆమెకు ఏం వచ్చింది? ఎందుకు ఈ పని చేశారు? అనే కారణాలు తెలియాల్సి ఉంది. నిజాంపేటలో కల్పన నివాసం ఉంటున్నారు. ఒక గేటెడ్ కమ్యూనిటీలోని విల్లా తీసుకుని జీవిస్తున్నారు. ఆ విల్లాలో నిద్ర మాత్రలు మింగి ఆవిడ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కల్పన అపస్మారక స్థితిలో ఉన్నారని తెలిసింది. ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

కల్పన ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ఆమె భర్త చెన్నైలో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. రెండు రోజలుగా విల్లా గేట్లు ఓపెన్ చేయకపోవడంతో అసోసియేషన్ సభ్యులకు సందేహం కలిగి ఆవిడకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదట. దాంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళు వచ్చి గేట్లు ఓపెన్ చేయగా… కల్పన అపస్మారక స్థితిలో ఉన్నారట. ప్రస్తుతం కల్పనకు వెంటిలేటర్ మీద వైద్యులు చికిత్స అందిస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆవిడ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందట. కొన్ని గంటలు గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేమని చెప్పారట.
కాగా, కల్పనను ఆస్పత్రికి తరలిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఆవిడ ఫేస్ చూసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు. కల్పన ముఖం అంతలా మారిందేమిటి? అని ఆశ్చర్యపోతున్నారు. ఆవిడ త్వరగా కోలుకోవాలని పరిశ్రమ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. కల్పన ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో విల్లాలో ఇతరులు ఎవరైనా ఉన్నారా? ఆవిడ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారు? పోలీసులకు కల్పన ఆత్మహత్యకు పాల్పడిన సమాచారం ఎవరు అందించారు? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తు జరుగుతోందని సమాచారం అందుతుంది.