ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవలి కాలంలో పలువురు నాయకులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు “పోలీసులు బట్టలు ఊడతీస్తా” అన్న వ్యాఖ్య పోలీస్ శాఖలో తీవ్ర అసంతృప్తికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై అనేక మంది పోలీస్ అధికారులు వాఖ్యలు చేస్తున్నారు. అందులో భాగంగా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ సూటిగా స్పందించారు.
వెనుక కథ ఉంది: ఎస్ఐ సుధాకర్ స్పందన
శ్రీసత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఈ విషయంపై చాలా కఠినంగా స్పందించారు. “ఈ యూనిఫాం మా కలల సాధన ఫలితం. రోజులు, నెలలు, నోటుబుక్స్ కిందేసి చదివాం, రోజూ ఉదయాన్నే లేచి పరుగులు పెట్టాం, వందల సంఖ్యలో పోటీదారుల్లో నిలిచి పరీక్షల్లో ఉత్తీర్ణులమై చివరకు ఈ పోలీసు యూనిఫాం ధరించాం. ఇది ఎవడో వచ్చి ఊడదీయగలిగే అరటితొక్క కాదని గుర్తుంచుకోండి” అని ఆయన అన్నారు. పోలీసుల కష్టం, వారికి ఉన్న అర్హతలను ఇలా తేలిగ్గా మాట్లాడటం దురదృష్టకరం అని అభిప్రాయపడ్డారు.

పోలీసుల సేవను చిన్నచూపు చూడవద్దు
ఎస్ఐ సుధాకర్ మాట్లాడుతూ, “మేము నిజాయితీగా ఉద్యోగం చేస్తున్నాం. ప్రజల పక్షాన నిలుస్తాం. ఎప్పుడూ ధర్మం పక్షాన ఉంటాం. మేము ఏ ఆదేశాలకైనా భయపడం. ప్రజల హితమే మాకు ముఖ్యమైంది. మేము జీతం తీసుకునేది ప్రజల నుండి కాదు, వారి విశ్వాసం నుండి. ఆ విశ్వాసాన్ని దెబ్బతీసేలా, మమ్మల్ని అవమానించేలా ఎవరూ మాట్లాడకూడదు” అని హెచ్చరించారు.
జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరిక
వైఎస్ జగన్కి ఆయన చివరగా ఓ గట్టి హెచ్చరిక ఇచ్చారు. “జాగ్రత్తగా మాట్లాడాలి. పోలీసుల గురించి మాట్లాడేటప్పుడు ప్రతీ పదం బాధ్యతతో ఉండాలి. ఆంధ్రప్రదేశ్ పోలీసులు రాష్ట్రానికి సేవలు అందించడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఆ యూనిఫాం యొక్క గౌరవాన్ని కాపాడుకోవడమే మా ధర్మం” అని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.