Service charge: ఢిల్లీ హైకోర్టు హోటళ్లు, రెస్టారంట్లు ఆహార బిల్లులలో సర్వీస్ ఛార్జీలను కలిపి వసూలు చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సర్వీస్ ఛార్జీలను వినియోగదారులు కచ్చితంగా చెల్లించేలా బిల్లులో వాటిని కలిపి ఇవ్వడం వారి హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది. రకరకాల పేర్లతో ఛార్జీలు వసూలు చేయడం అన్యాయమైన వ్యాపార విధానాలతో సమానమని మండిపడింది. సర్వీస్ ఛార్జీలు చెల్లించాలా.. వద్దా..? అనే విషయాన్ని కస్టమర్ల విచక్షణకే వదిలేయాలని సూచించింది.

అదనపు ఛార్జీలను విధించే రెస్టారంట్లపై తగిన చర్యలు
ఈ విధంగా వినియోగదారులపై అదనపు ఛార్జీలను విధించే రెస్టారంట్లపై తగిన చర్యలు తీసుకోవాలని వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థకు సూచించింది. హోటళ్లు బిల్లులలో సర్వీస్ ఛార్జీలు వసూలు చేయడాన్ని నిషేధిస్తూ వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ (CCPA) గతంలో చేసిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ పలు రెస్టారంట్ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.
హోటళ్లు కస్టమర్లపై ఇష్టారాజ్యంగా సర్వీస్ ఛార్జీలు
కొన్ని రకాల హోటళ్లు, రెస్టారంట్లలో వసూలు చేస్తున్న సర్వీస్ ఛార్జీలు.. పన్నుల కిందికి రావని కేంద్ర ప్రభుత్వం 2017లో ప్రకటించింది. వీటిని సేవా పన్నుగా పరిగణించడం పొరపాటేనని తెలిపింది. వాటి చెల్లింపులను వినియోగదారుడి అంగీకారానికే వదిలేస్తున్నట్లు అన్ని హోటళ్లలో బోర్డు ప్రదర్శించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శకాల ప్రకారం బిల్లులో సేవా రుసుము కాలమ్ను ఖాళీగా వదిలేయాలి. అయినప్పటికీ హోటళ్లు కస్టమర్లపై ఇష్టారాజ్యంగా సర్వీస్ ఛార్జీలు విధిస్తున్నాయి.