Election Commission : ఏపీలో మరోసారి ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్రానికి సంబంధించి ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానం ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ ఏర్పడింది. ఈ మేరకు ఆ రాజ్యసభ స్థానానికి సంబంధించి ఈనెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30న నామినేషన్ల పరిశీలన చేపట్టి.. మే 2 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. మే 9న ఎన్నిక నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. విజయసాయిరెడ్డికి 2028 జూన్ వరకు పదవీకాలం ఉండగానే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ స్థానానికి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మరి ఈ రాజ్యసభ స్థానం ఎవరికి దక్కుతుందనే చర్చ మొదలైంది.

టీడీపీకి రెండు, బీజేపీకి ఒక స్థానం
గతేడాది వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్యలు రాజీనామా చేశారు. ఈ మూడు స్థానాలు కూటమి దక్కించుకుంది. టీడీపీకి రెండు, బీజేపీకి ఒక స్థానం కేటాయించారు. టీడీపీ నుంచి బీద మస్తాన్రావు, సానా సతీష్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు.. బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యకు అవకాశం దక్కింది. అయితే ఈ ఏడాది జనవరిలో విజయసాయరెడ్డి తన రాజ్యసభ ఎంపీ పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇకపై వ్యవసాయం చేసుకుంటానన్నారు. అయితే ఆయన రాజీనామా చేసిన రాజ్యసభ ఎంపీ స్థానానికి సంబంధించిన ఎన్నిక కోసం ఇప్పుడు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అయితే ఈ రాజ్యసభ పదవి కూటమికి దక్కనుండటంతో.. మూడు పార్టీలలో ఎవరికి అవకాశం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే చర్చించి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
మద్యం కుంభకోణంలో సిట్ నోటీసులు జారీ
మరోవైపు విజయసాయిరెడ్డికి గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో సిట్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని విజయసాయిరెడ్డి నివాసానికి వెళ్లి సిట్ టీమే.. ఈ నెల 18న ఉదయం 10 గంటలకు విజయవాడ సిటీ పోలీసు కమిషనరేట్లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే విజయసాయిరెడ్డి ఈ నెల 17వ తేదీనే విచారణకు వస్తానని చెప్పారట.. అందుకు తగిన విధంగా సిట్ ఏర్పాట్లు చేసుకుంటోందట. ఈ మద్యం కుంభకోణంలో బీఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 179 ప్రకారం సాక్షిగా ఆయనను విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. గతంలో కూడా విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ స్కాంలో కర్త, కర్మ, క్రియ రాజ్ కసిరెడ్డేనని అన్నారు.
Read Also: నేడు విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు