Sajjanar: ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. పలువురు సినీ, క్రికెట్ సెలెబ్రెటీస్, యూట్యూబ్ స్టార్స్ చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ నమ్మి అమాయక ప్రజలు, యువకులు లక్షలాది రూపాయలు బెట్టింగ్స్ లో పెట్టి మోసపోయిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మంగళవారం మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన సోమేష్ అనే యువకుడు క్రికెట్ బెట్టింగ్ లో రూ.2 లక్షలు పోగొట్టుకొని, ఇంట్లో వాళ్ళకు మొహం చూపించలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

సమస్య ఏదైనా సరే.. ఆత్మహత్య పరిష్కారం కాదు
ఈ వ్యవహారంపై తీవ్ర ఆవేదన చెందిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ బెట్టింగ్ యాప్ బాధితులకు కీలక విజ్ఞప్తి చేశారు. సమస్య ఏదైనా సరే.. ఆత్మహత్య అనేది పరిష్కారం కాదన్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ భూతానికి వ్యసనపరులే బలవన్మరణాలను పాల్పడకండని యువకులకు వినతి చేశారు. క్షణికావేషంలో తీసుకునే నిర్ణయాల వల్ల మీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంతటి క్షోభను అనుభవిస్తారో ఒక్కసారి ఆలోచించమని అన్నారు. సమస్య వచ్చినప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలో అన్వేషించాలే తప్పా.. చనిపోవాలనే ఆలోచనే రాకూడదని సూచించారు. ఉన్నది ఒక్కటే జీవితం అని, ఏం సాధించిన అందులోనే అని తెలిపారు.
బలవన్మరణం వద్దు.. బతికి సాధించడమే ముద్దు
జీవన ప్రయాణంలో ఒక్కసారి కిందపడితే.. సర్వం కోల్పోయినట్లు కాదని, ఆముల్యమైనా జీవితాన్ని అర్దాంతరంగా కాలదన్నుకోవద్దని సలహా ఇచ్చారు. చీకటి వెలుగులా నిత్యం కష్టసుఖాలు అందర్నీ వెంటాడుతూనే ఉంటాయని, కష్టకాలంలో బాధలను ఇతరులతో పంచుకోవాలని, పరిష్కార మార్గాలు వెతకాలన్నారు. ఎంత కష్టం వచ్చినా ఎల్లకాలం ఉంటుందా?, చనిపోయినంతా మాత్రాన సమస్యలు టక్కున మాయమవుతాయా!? అనే ప్రశ్న వేసుకోవాలని, బలవన్మరణం వద్దు.. బతికి సాధించడమే ముద్దు అని యువతకు హితబోధ చేశారు.