లాహోర్లో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. భారత్పై ఉగ్రదాడులకు సంబంధించి ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా ఉగ్రవాది సైఫుల్లా కసూరి (Saifullah Kasuri) ఈ కార్యక్రమంలో పాల్గొనడం కేవలం రాజకీయంగా కాకుండా నైతికంగా, భద్రతాపరంగా కూడా తీవ్ర ఆందోళన కలిగించే అంశం. ముఖ్యంగా పంజాబ్ అసెంబ్లీ ప్రావిన్షియల్ స్పీకర్ మాలిక్ అహ్మద్ ఖాత్ వేదికపై అతనితో కలసి ఉండడం పాక్ ప్రభుత్వ సంస్థలు ఉగ్రవాదాన్ని సహకరిస్తున్నాయనే వాదనకు బలమిస్తోంది.

పహల్గామ్ దాడిపై కసూరి వ్యాఖ్యలు
లాహోర్ (Lahore) లో జరిగిన ఓ కార్యక్రమంలో లష్కరే తోయిబా ఉగ్రవాది, పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫుల్లా కసూరి పాల్గొని భారత్పై తన అక్కసు వెళ్లగక్కాడు. పంజాబ్ అసెంబ్లీ ప్రావిన్షియల్ స్పీకర్ మాలిక్ అహ్మద్ ఖాత్ ఈ కార్యక్రమానికి హాజరై కసూరితో పాటు వేదికపై ఆసీనులవడం గమనార్హం. సభలో సుమారు 20 నిమిషాల పాటు ప్రసంగించిన సైఫుల్లా కసూరి భారత్పై విమర్శలు చేశాడు. “పహల్గామ్ ఉగ్రదాడికి నన్ను మాస్టర్మైండ్ అనడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాను” అని కసూరి వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా, ఆపరేషన్ సిందూర్లో భాగంగా భారత బలగాల దాడిలో మరణించిన ఉగ్రవాది ముదస్సిర్ అహ్మద్ పేరు మీద పంజాబ్ ప్రావిన్స్లోని అల్హాఅబాద్లో పలు నిర్మాణాలు చేపడతానని కూడా ప్రకటించాడు. ఈ ర్యాలీలో పెద్దయెత్తున భారత వ్యతిరేక నినాదాలు చేశారు.
హఫీజ్ సయీద్ కుమారుడి హాజరు
ఈ కార్యక్రమంలో మరో కీలక ఉగ్రవాది, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ కూడా పాల్గొనడం అత్యంత గంభీర పరిణామం. ఇతను కూడా తన ప్రసంగంలో భారత వ్యతిరేకతను రెచ్చగొట్టేలా మాట్లాడాడు.
లష్కరే తోయిబా – రాజకీయ ముసుగులో మళ్లీ ముందుకు
లష్కరే తోయిబా పేరుతో నిషేధిత సంస్థ అయినా, పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్ (PMML) పేరుతో పలు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించడం ఆ దేశం యొక్క ద్వంద్వ వైఖరిని వెల్లడిస్తోంది. లాహోర్లోని నేషనల్ అసెంబ్లీ 122వ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన తల్హా సయీద్, లష్కరే రాజకీయ విభాగమైన పీఎంఎంఎల్ నిర్వహించే కార్యక్రమాల్లో తరచూ కనిపిస్తుంటాడు. పాకిస్థాన్లో లష్కరే తోయిబాపై అధికారికంగా నిషేధం అమల్లో ఉన్నప్పటికీ ఆ సంస్థ పీఎంఎంఎల్ అనే ముసుగులో తన కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తోంది.
Read also: Rajnath Singh: పాక్ ఆక్రమిత కశ్మీర్పై రాజ్నాథ్సింగ్ కీలక వ్యాఖ్యలు