తెలంగాణ (Telangana) రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రైతు భరోసా (Rythu Bharosa) సాయాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు మూడు నుండి మూడున్నర ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందిన విషయం తెలిసిందే. అయితే, ఇంకా ఎక్కువ భూములు కలిగిన రైతులు సాయం పొందలేదని, దీనిపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం.
రైతుల ఖాతాల్లోనూ రైతు భరోసా డబ్బులు జమ
ఈనెల 23వ తేదీ తర్వాత నాలుగు ఎకరాలు లేదా అంతకన్నా ఎక్కువ భూమి కలిగిన రైతుల ఖాతాల్లోనూ రైతు భరోసా డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు రూ.6వేలు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందిస్తోంది. ఈసారి సమగ్రంగా అన్ని స్థాయిల రైతులకు న్యాయం జరగేలా చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
విడతలవారీగా సాయం
రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం, విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు అవసరాలకు ముందుగానే నిధులు అందించడం లక్ష్యంగా ఈ పథకం కొనసాగుతోంది. గతంలో ఏకకాలంలో అందని రైతులకు విడతలవారీగా సాయం ఇవ్వడం ద్వారా వ్యవసాయ ఖర్చులకు ఉపశమనం కలిగించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. రైతులు పొలాల్లో సాగు పనుల్లో నిమగ్నమవుతున్న ఈ సమయంలో, ఈ నిధులు వారికెంతో ఉపయోగపడతాయని అంచనా.
Read Also : HYD-Metro : హైదరాబాద్ మెట్రో నిర్వహణపై నెటిజన్ల ఫైర్