Putin: భారత్ పర్యటనకు రావాల్సిందిగా ప్రధాని మోడీ చేసిన ఆహ్వానాన్ని తమ దేశాధినేత వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించినట్లు రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ వెల్లడించారు. “రష్యా అండ్ ఇండియా” టువర్డ్ ఏ బైలాటరల్ అజెండా పేరుతో రష్యన్ ఇంటర్నేషనల్ అఫైర్స్ కౌన్సిల్ నిర్వహించిన కాన్ఫరెన్స్లో లావ్రోవ్ మాట్లాడుతూ.. ఈ పర్యటన కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. అయితే, పర్యటన తేదీలను మాత్రం ఆయన వెల్లడించలేదు. భారత ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన ప్రధాని మోడీ తొలి అంతర్జాతీయ పర్యటన రష్యాలో చేసిన విషయాన్ని లావ్రోవ్ గుర్తుచేశారు. ఇప్పుడు తమవంతు వచ్చిందన్నారు.

భారత్కు రావాలని పుతిన్ను మోడీ ఆహ్వానించారు.
కాగా, గతేడాది జులైలో ప్రధాని మోడీ రష్యాలో పర్యటించారు. ఐదేళ్ల వ్యవధి తర్వాత అక్కడ పర్యటించడం అదే తొలిసారి. అంతకుముందు 2019లో రష్యాలోని వ్లాదివోస్టోక్ నగరంలో నిర్వహించిన ఆర్థిక సదస్సులో మోడీ పాల్గొన్న సంగతి తెలిసింది. ఇటీవల రష్యా పర్యటన సందర్భంగా భారత్కు రావాలని పుతిన్ను మోడీ ఆహ్వానించారు. అమెరికా నుంచి టారిఫ్ల ముప్పు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపునకు సంప్రదింపులు జరుగుతోన్న సమయంలో పుతిన్ భారత్లో పర్యటించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
పుతిన్ గతంలో చాలాసార్లు భారత పర్యటనకు వచ్చారు
ఇకపోతే..భారత్-రష్యా మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉంటాయన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉక్రెయిన్ యుద్ధం సైతం దీనిపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. పైగా రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చలు, శాంతి ఒప్పందం ద్వారానే యుద్ధం ముగుస్తుందని భారత్ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. పుతిన్ గతంలో చాలాసార్లు భారత పర్యటనకు వచ్చారు. 2000 సంవత్సరంలో అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా ఆయన భారత భూభాగంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత పలు సదస్సులు, ద్వైపాక్షి ఒప్పందాల కోసం 2004, 2010, 2012, 2014, 2018, 2021లో పర్యటించారు.