విజయవాడ ప్రభుత్వాస్పత్రి (Vijayawada Government Hospital)లో జరుగుతున్న పోస్టుమార్టం ప్రక్రియపై తీవ్రమైన ఆరోపణలు వెలువడుతున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టానికి తెచ్చే సమయంలో కుటుంబసభ్యులు ఇప్పటికే గాఢ విషాదంలో ఉంటారు. అయితే, ఆ బాధను అర్థం చేసుకోవాల్సిన సిబ్బంది మాత్రం డబ్బు కోసం రకరకాల పేర్లతో వసూళ్లు చేస్తున్నారని కుటుంబసభ్యులు చెబుతున్నారు.ప్రభుత్వాస్పత్రికి ఎక్కువగా ప్రమాదాలు, ఆత్మహత్యల కేసుల్లో మృతదేహాలే వస్తున్నాయి. ఇటీవల రాణిగారితోటకు చెందిన ఓ భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదంలో మరణించాడు. అతడి మృతదేహం పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ సమయంలో సిబ్బంది రూ.7 వేల వరకు డిమాండ్ చేశారని కుటుంబీకులు తెలిపారు. చివరికి బలవంతంగా రూ.4 వేలు ఇచ్చి పోస్టుమార్టం (Postmortem) చేయించుకున్నారని వారు వాపోయారు.
మరో ఘటన – ఇబ్రహీంపట్నం యువకుడు
వారం క్రితం ఇబ్రహీంపట్నానికి చెందిన యువకుడు వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు కావడంతో మృతదేహం పోస్టుమార్టానికి వచ్చింది. కుటుంబం తీవ్ర షాక్లో ఉండగా, సిబ్బంది రూ.8 వేల డిమాండ్ చేశారు. ఆ మొత్తం ఇవ్వలేకపోవడంతో, అతడి స్నేహితులు రూ.5 వేల రూపాయలు ఇచ్చి పోస్టుమార్టం జరిపించాల్సి వచ్చింది. ఈ సంఘటనలు స్థానిక ప్రజల్లో ఆగ్రహాన్ని రేపుతున్నాయి.మృతదేహంపై పోస్టుమార్టం చేయడానికి, పంచనామా ఇవ్వడానికి, ఫొటోలు తీయడానికి, గది శుభ్రం చేయడానికి ఇలా రకరకాల పేర్లతో సిబ్బంది డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తాలు కుటుంబ స్థితిగతులను బట్టి మారుతాయని, ముఖ్యంగా పేదలే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని బహిరంగంగా చర్చ జరుగుతోంది.
పంచనామా కోసం కూడా వసూళ్లు
పోస్టుమార్టం పూర్తయ్యాక మృతుని కుటుంబం పంచనామా పోలీసుల నుంచి పొందాలి. బీమా లేదా పాలసీల క్లెయిమ్ కోసం ఈ పత్రం తప్పనిసరి. అయితే, పంచనామా ఇవ్వడానికి కూడా పోలీసులు సిబ్బందితో కలిసి డబ్బు డిమాండ్ చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డబ్బు ఇవ్వకపోతే పత్రంలో సమస్యలు తలెత్తుతాయేమోనన్న భయం వల్ల కుటుంబీకులు బలవంతంగా డబ్బు ఇవ్వాల్సి వస్తోంది.
పేదలపై మరింత భారమని వాపోసు
ఆర్థికంగా బలమైన కుటుంబాలు బాధలోనూ డబ్బు ఇస్తాయి. కానీ పేదలకు మాత్రం ఇది భరించలేని భారమవుతోంది. ఇప్పటికే కుటుంబ పోషకుడు కోల్పోయి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న వారికి, అదనంగా ఈ దోపిడీ మరింత కష్టాలు పెడుతోంది. “ప్రాణం పోసేవాడు డాక్టర్, కానీ ప్రాణం పోయిన తర్వాత కూడా దోపిడీ చేసే వారిని ఏమని పిలవాలి?” అంటూ బాధిత కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి.
అధికారుల జోక్యం అవసరం
ఈ ఘటనలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ప్రభుత్వం జీతాలు ఇస్తూనే, శవాలపై దోపిడీ చేయడం దుర్మార్గం” అని మృతుని స్నేహితుడు అర్జున్ వ్యాఖ్యానించాడు. ఈ వ్యవహారంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి అన్యాయాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Read Also :